రాహుల్‌ జైలుశిక్షపై మధ్యంత స్టే విధించేందుకు గుజరాత్ హైకోర్టు నో

మంగళవారం, 2 మే 2023 (18:10 IST)
పరువు నష్టం దావా కేసులో కింది కోర్టు విధించిన జైలుశిక్షపై మధ్యంతర స్టే విధించాలని కోరుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై ఇప్పటికిప్పుడు స్టే విధించేందుకు గుజరాత్ హైకోర్టు నిరాకరించింది. అదేసమయంలో జూన్ నాలుగో తేదీ తర్వాత ఉత్తర్వులు ఇస్తామని తెలిపింది. దీంతో పరువునష్టం కేసులో హైకోర్టు ఆర్డర్‌ వచ్చే వరకు తన శిక్షపై స్టే విధింపు కోసం ఆయన చేసిన ప్రయత్నం ఫలించలేదు.  
 
'దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుందో?' అంటూ గత 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో రాహుల్‌ వ్యాఖ్యానించారంటూ గుజరాత్‌ భాజపా ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ సూరత్‌ న్యాయస్థానంలో పరువునష్టం దావా వేయడంతో ఈ కేసు వ్యవహారం మొదలైంది. దీనిపై విచారణ చేపట్టిన ట్రయల్‌ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. 
 
అలాగే దీన్ని‌పై కోర్టులో సవాల్‌ చేసేందుకు వీలుగా 30 రోజుల గడువు ఇచ్చింది. అప్పటివరకు బెయిల్‌ మంజూరు చేసింది. ఆ తర్వాత రాహుల్‌పై ఎంపీగా అనర్హత వేటు వేస్తూ లోక్‌సభ సచివాలయం నిర్ణయం తీసుకుంది. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం, పార్లమెంటు సభ్యులు ఏదైనా కేసులో దోషిగా తేలి.. కనీసం రెండేళ్ల శిక్ష పడితే అనర్హతకు గురవుతారని గుర్తు చేసింది.
 
అనంతరం రాహుల్‌ గాంధీ సూరత్‌ సెషన్స్‌ కోర్టును ఆశ్రయించారు. రెండేళ్ల జైలు శిక్షను నిలుపుదల చేయాలని.. అలాగే తనను దోషిగా తేలుస్తూ ఇచ్చిన తీర్పును సైతం నిలిపివేయాలంటూ రెండు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ఏప్రిల్‌ 3న విచారణ చేపట్టిన కోర్టు.. ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. తదుపరి విచారణలో భాగంగా ఏప్రిల్‌ 13న ఇరు పక్షాల వాదనలు విని 20న తీర్పు వెలువరించింది. దీనిపై రాహుల్‌ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. ఇక్కడ మధ్యంతర స్టే విధించేందుకు నో చెప్పింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు