భవిష్యత్తులో మనిషి మృత్యుంజయుడే: 200 ఏళ్లలో ఇది సాధ్యం!

బుధవారం, 27 మే 2015 (17:11 IST)
జెరూసలెంలోని హిబ్రూ యూనివర్శిటీ ప్రొఫెసర్ యువల్ నోవా హరారి భవిష్యత్తులో మనిషికి మరణం అనేది ఉండదంటున్నారు. బయోటెక్నాలజీ, జెనెటికల్ ఇంజినీరింగ్ సాయంతో మనిషి మృత్యువును జయిస్తాడని, మరో 200 ఏళ్లలో ఇది సాధ్యమవుతుందని హరారి ధీమాగా చెప్తున్నారు. రాబోయే రోజుల్లో సగం మనిషి, సగం యంత్రం తరహా సైబోర్గ్‌లు వస్తాయని, ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసుకుంటే ఇక చావు అనేది దగ్గరకు కూడా రాదని తెలిపారు. 
 
అయితే, ఇది ధనవంతులకు మాత్రమే సాధ్యమని, ఈ ప్రక్రియ చాలా ఖర్చుతో కూడుకున్నదని హరారి ట్విస్ట్ ఇచ్చారు. ఈ దిశగా ప్రయోగాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, చావును జయించడం అసాధ్యమేమీ కాదని హరారి తెలిపారు. ఈ ప్రయోగాల ద్వారా జననమరణాలపై మనిషికి పూర్తి అదుపు ఉంటుందని స్పష్టం చేశారు. భూమిపై జీవం మొదలయ్యాక, ఇది మహోన్నత ఆవిష్కరణ అవుతుందని హరారి పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి