ప్రపంచానికి భారత్ ఆశాకిరణం : ప్రశంసల వర్షం కురిపించిన బిల్ గేట్స్

గురువారం, 23 ఫిబ్రవరి 2023 (11:31 IST)
భారతదేశంపై మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచానికి భారత్ ఒక ఆశాకిరణంలా నిలిచిందని ఆయన కొనియాడారు. పైగా, ఏకకాలంలో అనేక సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని చేతల ద్వారా నిరూపించిందని ఆయన గుర్తుచేశారు. ఈ మేరకు ఆయన గేట్స్ నోట్స్ పేరిట తన బ్లాగులో భారత్‌ను ప్రశంసిస్తూ కొన్ని వ్యాఖ్యలు రాశారు. 
 
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న భారీ సమస్యలను ఏకకాలంలో ఎదుర్కోవచ్చన్న నమ్మకం తనకుందని చెప్పారు. ఇందుకోసం సరైన ఆవిష్కరణలు, వాటి ఫలాలు ప్రజలకు అందేలా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. అయితే, ప్రస్తుత సమస్యలను ఎదుర్కొనేందుకు కావాల్సిన డబ్బు, సమయం అందుబాటులో లేవని కొందరు తరచూ తనతో వ్యాఖ్యానిస్తుంటారని తెలిపారు. ఈ భవన తప్పని భారత్ రుజువు చేసిందన్నారు. 
 
"ఇది తప్పని చెప్పేందుకు భారత్‌కు మించిన నిదర్శనం మరొకటి లేదు. భారత్ ఇటీవలికాలంలో అద్భుతమైన ప్రగతి సాధించింది. ప్రపంచానికి ఆశాకిరణంగా నిలిచింది. భారీ సవాళ్ళను ఏకకాలంలో ఎదుర్కోవచ్చని నిరూపించింది. భారత్  పోలియో వ్యాధిని పారద్రోలింది. హెచ్.ఐ.వి. వ్యాప్తికి అడ్డుకట్ట వేసింది. పేదరికం, శిశుమరణాలను గణనీయంగా తగ్గించింది. పారిశుధ్యం, ఆర్థికసేవలను అధికశాతం మందికి అందుబాటులోకి తెచ్చింది" అని బిల్ గేట్స్ తన నోట్స్‌లో రాసుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు