ఉత్తర కొరియాలో ఆహారపు కొరత.. పెంపుడు కుక్కలపై కిమ్ కీలక నిర్ణయం!

మంగళవారం, 18 ఆగస్టు 2020 (09:15 IST)
ఉత్తర కొరియా రాష్ట్రంలో ఆహారపు కొరత ఏర్పడింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఉత్తర కొరియా దేశ సరిహద్దులను మూసివేసింది. దీంతో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆహార సరఫరా పూర్తిగా ఆగిపోయింది. ఫలితంగా దేశ వ్యాప్తంగా ఆహారపు నిల్వలు పూర్తిగా అడుగంటిపోయి, ఆహారపు కొరత ఏర్పడింది. ఈ క్రమంలో ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అంత్యత కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఉన్న పెంపుడు కుక్కలన్నింటినీ ప్రభుత్వానికి అప్పగించాల్సిందిగా ఆయన ఆదేశాలు జారీచేశారు. అంటే.. కుక్కమాంసం కోసమే ఆయన ఈ తరహా ఆదేశాలు జారీచేశారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. 
 
ఇందుకోసం ఆయన జూలై నెలలో కొత్త జాతీయ విధానాన్ని ప్రకటించారు. ఎవరైనాగానీ పెంపుడు కుక్కను కలిగివుండడం జాతీయ చట్టానికి వ్యతిరేకం అని హుకుం జారీచేశారు. అంతేకాదు, పెంపుడు కుక్కను కలిగివుండడం కళంకిత బూర్జువా విధానానికి ప్రతీక అని కిమ్ సూత్రీకరించారు. కిమ్ ఆదేశాలు ఇచ్చిందే తరువాయి, అధికారులు పెంపుడు కుక్కలు ఉన్న ఇళ్లను గుర్తించి, వాటిని పట్టుకునే చర్యల్లో నిమగ్నమయ్యారు. 
 
ఈ శునకాలను ప్రభుత్వం నిర్వహించే జూలకు గానీ, కుక్కమాంసం వంటకాలు విక్రయించే రెస్టారెంట్లకు గానీ తరలించనున్నారు. కొరియాలో కుక్కమాంసం తినడం ఎప్పట్నించో ఉంది. అయితే, కుక్కమాంసం తినే అలవాటు దక్షిణ కొరియాలో క్రమంగా తగ్గిపోతుండగా, కిమ్ మాత్రం ఆహార కొరత నేపథ్యంలో పెంపుడు కుక్కలపై పడ్డారని అతడి వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు