పాకిస్థాన్‌‍ను చెరబట్టిన మరో ఉగ్రసంస్థ - ఒకే రోజు 25 మంది సైనికుల కాల్చివేత

బుధవారం, 13 డిశెంబరు 2023 (10:18 IST)
దాయాది దేశం పాకిస్థాన్‌ను ఉగ్రవాద సంస్థలు చెరబట్టాయి. భారత్‌కు వ్యతిరేకంగా తీవ్రవాద కార్యకాలాపాలు సాగించే తీవ్రవాద సంస్థలను పెంచి పోషించి, ప్రోత్సహించిన పాకిస్థాన్.. ఇపుడు అదే తీవ్రవాద సంస్థల చేతిలో చిక్కుకుని కొట్టుమిట్టాడుతుంది. ఒక విధంగా చెప్పాలంటే పాక్‌ను పలు తీవ్రవాదసంస్థలు చెరబట్టాయి. తాజాగా కొత్త ఉగ్ర సంస్థ తెహ్రీకే జిహాద్ పాకిస్థాన్ (టీజేపీ) పాక్‌లో పురుడు పోసుకుంది. ఇప్పుడీ కొత్త తీవ్రవాద సంస్థ పాక్ సైన్యానికి సవాలు విసురుతుంది. 
 
తాజాగా ఒక్క రోజే ఏకంగా 25 మంది పాక్ సైనికులను హతమార్చింది. పైగా, వీరిని తామే చంపేసినట్టు ధైర్యంగా ప్రకటించింది. పాక్‌లోని ఖైబర్ పఖుంక్వా ప్రావిన్స్‌లో జరిగిన మూడు వేర్వేరు ఘటనల్లో 25 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలకు తమదే బాధ్యత అని టీజేపీ పేర్కొంది. ఈ ఏడాది ఒక్కరోజులో ఇంతమంది సైనికులు ఉగ్రవాదదాడుల్లో మరణించడం ఇదే ప్రథమం. అలాగే, పాక్ సైనికులు జరిపిన కాల్పుల్లో 27 మంది అనుమానిత తీవ్రవాదలు హతమయ్యారు. 
 
కాగా, ఈ సంస్థ నేపథ్యాన్ని పరిశీలిస్తే, తెహ్రీకే తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ)కి అనుబంధ సంస్థ. ఈ నయా ముష్కర మూక ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏర్పడింది. ఇప్పటికే పాక్‌లో డజను వరకు భయానక ఉగ్రదాడులకు పాల్పడింది. విశృంఖల నరమేథం సాగిస్తూ 50 మంది వరకు సైనికులను పొట్టనబెట్టుకుంది. టీజేపీ కేవలం సైనిక వర్గాలనే లక్ష్యంగా చేసుకుంటూ దేశ సార్వభౌమత్వానికి సవాలు విసురుతోంది. తెహ్రీకే తాలిబన్ సంస్థ దాడులు చేస్తే పౌరులు కూడా మృతి చెందిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అయితే, తెహ్రీకే జిహాద్ సంస్థ మాత్రం సాధారణ పౌరుల జోలికి వెళ్లకుండా, కేవలం ఆ దేశ సైన్యాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తుండటంతో పాక్ పాలకలకు తలనొప్పిగా మారింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు