మాఫియా డాన్ దావూద్ కరాచీలోనే ఉన్నాడు : పాకిస్థాన్

శనివారం, 22 ఆగస్టు 2020 (22:23 IST)
పాకిస్థాన్ ఎట్టకేలకు ఓ నిజాన్ని అంగీకరించింది. కరుడుగట్టిన ఉగ్రవాది, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం తమ దేశంలోనే ఉన్నాడనీ, అదీ కూడా కరాచీలో నివసిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో భారత్ చేస్తున్న సుధీర్ఘకాల పోరాటానికి ఫలితం దక్కినట్టయింది. పాకిస్థాన్‌లో ఉన్నట్టుండి ఈ మార్పు రావడానికి బలమైన కారణం లేకలేదు. పాక్ గడ్డపై ఉన్న ఉగ్రవాదుల పేర్లను వెల్లడించాలని ఇంటాబయట నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చాయి. వస్తున్నాయి కూడా. అయినప్పటికీ పాక్ ఎక్కడా తలొగ్గలేదు. 
 
ఈ క్రమంలో కరుడుగట్టిన ఉగ్రవాదులు, నేరస్తుల ఆర్థిక కార్యకలాపాలపై ఆంక్షలు విధించకపోతే అంతర్జాతీయంగా అందుతున్న ఆర్థిక సాయాన్ని నిలిపివేసేలా బ్లాక్ లిస్టులో చేర్చుతామంటూ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) చేసిన హెచ్చరింది. ఈ వార్నింగ్‌తో పాక్ దిగిరాకతప్పలేదు. ఎఫ్ఏటీఎఫ్ తనను బ్లాక్ లిస్టులో చేర్చకముందే పాక్ జాగ్రత్త పడింది. 
 
ఈ క్రమంలో ఉగ్రవాద నేతలు హఫీజ్ సయీద్, మసూద్ అజహర్‌లతో సహా మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, అతడి అనుచరుల ఆర్థిక కార్యకలాపాలపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. వారి ఆస్తుల జప్తుకు, బ్యాంక్ అకౌంట్ల నిలిపివేతకు ఆదేశాలు జారీ చేసింది.
 
పాక్ ఆంక్షలు విధించిన వారిలో తాలిబాన్, దాయిష్, హక్కానీ నెట్వర్క్, అల్ ఖైదా ఉగ్రవాద ప్రముఖులు కూడా ఉన్నారు. ఈ ఆంక్షలు అన్ని స్థిర, చరాస్తులకు వర్తిస్తాయని తెలుస్తోంది. పాక్ కఠిన ఆంక్షలు విధించిన నేపథ్యంలో, ఉగ్రవాద సంస్థలు విదేశాలకు నగదు బదిలీ చేసి పెద్ద ఎత్తున ఆయుధాలు సమకూర్చుకునేందుకు ఇకపై వీలుపడదని భావిస్తున్నారు.
 
పారిస్ వేదికగా పనిచేసే ఎఫ్ఏటీఎఫ్ పాకిస్థాన్‌ను 2018లో గ్రే లిస్టులో చేర్చింది. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోకపోతే బ్లాక్ లిస్టులో చేర్చుతామంటూ స్పష్టం చేసింది. అందుకు 2019 డిసెంబరును గడువుగా విధించింది. అయితే కరోనా కారణంగా ఆ డెడ్‍‌లైన్‌ను మరికాస్త పొడిగించింది. ఈ క్రమంలో పాకిస్థాన్ ఆగస్టు 18న ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా ఉగ్రవాదులపై కఠిన ఆంక్షలు విధించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు