ప్రజలంతా మంచి దారిలో నడిస్తే 2017 బాగుటుంది.. లేకుంటే : పోప్ ఏమంటున్నారు

సోమవారం, 2 జనవరి 2017 (10:55 IST)
ప్రపంచ ప్రజలంతా తమలోని ద్వేష భావన్ని వీడి స్నేహభావంతో మెలగాలని క్రైస్తవ మతపెద్ద పోప్‌ ఫ్రాన్సిస్‌ పిలుపునిచ్చారు. అంటే.. ప్రజలంతా మంచి దారిలో నడిస్తే 2017 సంవత్సరం బాగుంటుందని లేకుంటే మరిన్ని కష్టాలు తప్పవని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
నూతన సంవత్సరం సందర్భంగా సెయింట్‌ పీటర్స్‌ స్క్వేర్‌లో ప్రార్థనలకు హాజరైన వారినుద్దేశించి పోప్‌ ఫ్రాన్సిస్‌ ప్రసంగించారు. ప్రతి ఒక్కరూ ద్వేషభావాన్ని, హింసను విడనాడాలని, ప్రేమ, సోదరభావంతో మెలగుతూ శాంతి నెలకొనేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. 
 
కొత్త ఆశలు, ఆకాంక్షలతో నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాల్సిన సమయంలోనూ దుర్వార్తను వినాల్సిరావడం బాధాకరమన్నారు. టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఓ నైట్‌క్లబ్‌పై దాడి జరిగి.. 39 మంది మరణించడం, పదుల సంఖ్యలో గాయపడటాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాదంపై పోరాడుతున్న వారికి ధైర్యాన్ని ప్రసాదించాల్సిందిగా దేవుణ్ని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి