సల్మాన్ కోసం...! కరాచీ టు ఇండియా...!! పంజాబ్‌లో పాకిస్తాన్ యువతి.. నమ్మాలా..?

శనివారం, 1 ఆగస్టు 2015 (13:15 IST)
‘భజరంగీ భాయిజాన్’ మూవీ ఆ యువతిపై తీవ్ర ప్రభావం చూపింది. సల్మాన్ ఖాన్‌ను చూడాలని వెనుక ముందు చూడకుండా పాకిస్తాన్‌లోని లాహోర్‌లో రైలెక్కి నేరుగా ఇండియాలో అడుగు పెట్టేసింది. పంజాబ్‌లో కాలు పెట్టిన ఆమె వ్యవహారంపై అనుమానం రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకుంటే నీళ్ళు నమిలి ఇండియాలో చిక్కుల్లో పడింది. వివరాలిలా ఉన్నాయి. 
 
కరాచీకి చెందిన 27 ఏళ్ల చందాఖాన్ అనే యువతి పంజాబ్ రైల్వే స్టేషన్‌లో దిగింది. ఇప్పటికే ఉగ్రవాదుల దాడితో ఉక్కిరిబిక్కిరైన పంజాబ్ పోలీసులకు చందా కొత్త సమస్య తెచ్చి పెట్టింది. తన వ్యవహారశైలితో చుక్కలు చూపించింది. అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులకు అనుమానం వచ్చి ఈమెను విచారించారు. తన కొడుకు కోసం ఢిల్లీలోని దర్గాలో ప్రార్థన చేయడానికి కు వెళ్తున్నానని ఒకసారి చెప్పింది. అయితే తరువాత వెంటనే తప్పిపోయిన తన అంకుల్ కోసం వెతుకుతున్నానని మరోసారి అంది. 
 
చివరకు గట్టిగా ప్రశ్నించడంతో తాను హీరో సల్మాన్‌ఖాన్ కోసం వచ్చానని ఇలా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. రూ. 771 పాక్‌కు చెందిన మనీ మాత్రమే వుంది. ఆమె దగ్గర పాస్‌పోర్టుకానీ, టికెట్‌కానీ లేకపోవడంతో ఆమె ప్రయాణించిన స్టేషన్లు అత్తారి- లాహోర్ రైల్వే అధికారులను సంప్రదించారు. 
 
చందాకు సంబంధించిన ఎటువంటి వివరాలు తమ వద్దలేవని అక్కడి అధికారులు కూడా సమాధానం ఇచ్చారు. దీంతో చందాను అరెస్ట్ చేసిన పోలీసులు, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. చందాఖాన్ ఇండియాలో ఎందుకు అడుగు పెట్టిందని అనే విషయం ఇంకా ప్రశ్నార్థకంగానే మిగిలాయి. 

వెబ్దునియా పై చదవండి