అణు వివాదంపై చర్చలు జరిపేందుకు అమెరికాకు ఉత్తర కొరియా ఆహ్వానం పలికింది. వచ్చే నెలలో వివాదాస్పద అణు కార్యక్రమంపై చర్చలు జరిపేందుకు ఉత్తర కొరియా అధికారిక యంత్రాంగం అమెరికా రాయబారిని ఆహ్వానించిందని దక్షిణ కొరియా మీడియా మంగళవారం వెల్లడించింది. ఉత్తర కొరియా అణు వివాదంపై గతంలో ఆరు దేశాల చర్చలు జరిగిన సంగతి తెలిసిందే.
అయితే ఈ చర్చల్లో ఎటువంటి ఫలితం కనిపించలేదు. ఉత్తర కొరియా ఈ చర్చలకు ముగింపు పలికి తిరిగి తన అణు కార్యక్రమాన్ని పునరుద్ధరించింది. ఇటీవల రెండోసారి అణు పరీక్ష, ఆపై వరుసగా క్షిపణి పరీక్షలు నిర్వహించి ఉత్తర కొరియా అగ్రరాజ్యాలను కలవరపెట్టింది. ఈ నేపథ్యంలో.. ఉత్తర కొరియాపై అగ్రరాజ్యాలు ఆంక్షలు విధించాయి.
ప్రస్తుతం పట్టుసడలించిన ఉత్తర కొరియా వివాదాస్పద అణు కార్యక్రమంపై అమెరికాతో ప్రత్యక్ష చర్చలు జరిపేందుకు ఆసక్తి కనబరుస్తోంది. ఇందులో భాగంగానే అమెరికా రాయబారితో వచ్చే నెలలో చర్చలు జరిపేందుకు ఉత్తర కొరియా ప్రయత్నిస్తోందని మీడియా కథనాలు వెల్లడించాయి. అమెరికా మాత్రం ఆరు దేశాల చర్చలు పునరుద్ధరించాలని కోరుకుంటోంది. అయితే ఆరు దేశాల చర్చలకు మాత్రం తాము తిరిగి వచ్చే ప్రసక్తి లేదని ఉత్తర కొరియా ప్రభుత్వం పలుమార్లు స్పష్టం చేసింది.