కెనడాలో స్వైన్ ఫ్లూ కారణంగా ఈ రోజు వరకు 66 మంది మృతి చెందారు. అయితే కెనడావాసులు మాత్రం భారత్, మరికొన్ని ఇతర దేశాల మాదిరిగా ఎటువంటి భయాందోళనలకు గురికావడం లేదు. మెక్సికో నుంచి వచ్చే వారికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం, ప్రజారోగ్య శాఖ సిబ్బంది మార్గదర్శకాలు జారీ చేయడంతో కెనడా అధికారిక యంత్రాంగం వ్యాధి నియంత్రణ చర్యలను ముగించింది.
ఈ చర్యలతోనే కెనడావాసులు ఎటువంటి భయాందోళనలు లేకుండా తమ పని తాము చేసుకుపోతున్నారు. కనీసం నగరాల్లోని రోడ్లపై మాస్కులు ధరించిన వెళుతున్న పౌరులు కూడా కనిపించడం లేదంటే, వారు స్వైన్ ఫ్లూ వ్యాధిని తేలిగ్గా తీసుకుంటున్న విషయం అర్థమవుతోంది. సాధారణ వేసవి జ్వరాలతోనే కెనడాలో ప్రతి ఏటా 4000 వేల పౌరులు మృత్యువాత పడుతుంటారు.
అయితే వారు ప్రపంచ దేశాలను వణికిస్తున్న స్వైన్ ఫ్లూ గురించి పెద్దగా ఆందోళన చెందడం లేదు. ప్రభుత్వ యంత్రాంగం మాత్రం ఆరోగ్య శాఖ సిబ్బందిని అప్రమత్తం చేయడంతోపాటు, ఇతర దేశాల నుంచి వస్తున్న వారి విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకుంటుంది. కెనడాలోకి స్వైన్ ఫ్లూ ఓ రైతు కూలి ద్వారా వచ్చినట్లు భావిస్తున్నారు. ఏప్రిల్లో సెలవులపై మెక్సికో వెళ్లి వచ్చిన ఇతని ద్వారా దేశంలోకి స్వైన్ ఫ్లూ వచ్చినట్లు అధికారిక వర్గాలు అనుమానిస్తున్నాయి.