జిన్‌జియాంగ్ అల్లర్లు: 200 మందిపై విచారణ

చైనా తూర్పు ప్రాంతంలోని జిన్‌జియాంగ్ ప్రావీన్స్‌లో గత నెలలో జరిగిన హింసాత్మక అల్లర్లకు సంబంధించి ప్రభుత్వం 200 మందిపై కేసులు నమోదు చేసింది. వీరి కోర్టు విచారణ ఈ వారం ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు చైనా ప్రభుత్వం నడుపుతున్న వార్తాపత్రిక సోమవారం పేర్కొంది. వర్గ వైషమ్యాలతో జిన్‌జియాంగ్ ప్రావీన్స్ రాజధాని ఉరుంఖీ గత నెలలో అట్టుడికిన సంగతి తెలిసిందే.

రెండు జాతుల మధ్య జరిగిన ఘర్షణల్లో 200 మందికిపైగా పౌరులు మృతి చెందారు. మరో 1700 మంది గాయపడ్డారు. గత కొన్ని దశాబ్దాల్లో చైనాలో ఇటువంటి వర్గ ఘర్షణలను ఎన్నడూ చోటుచేసుకోలేదు. తుర్కు భాష మాట్లాడే ముస్లిం ఉయ్‌గుర్ వర్గానికి, చైనాలో మెజారిటీ సంఖ్యలో ఉన్న హాన్ చైనీస్ మధ్య ఈ ఘర్షణలు జరిగాయి.

హింసాకాండకు సంబంధించి అధికారిక యంత్రాంగం 200 మంది కేసులు పెట్టింది. ఈ కేసుల విచారణ ప్రావీన్స్ రాజధాని ఉరుంఖీలోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కేసుల విచారణలో ప్రవేశపెట్టేందుకు 3300 సాక్ష్యాధారాలను అధికారిక యంత్రాంగం సేకరించింది. వీటిలో 91 వీడియో టేపులు, 2169 ఫొటోలు కూడా ఉన్నాయి. విచారణ ఈ వారంలోనే ప్రారంభమవుతుందని చైనా వార్తా పత్రిక తెలిపింది.

వెబ్దునియా పై చదవండి