తాను చేపట్టిన ఐదు రోజుల భారత్ పర్యటన విజవంతమైందని నేపాల్ ప్రధాని మాధవ్ కుమార్ నేపాల్ అన్నారు. ఆయన తన పర్యటనను విజయవంతంగా ముగించుకుని ఆదివారం నేపాల్ రాజధాని ఖాట్మండుకు చేరుకున్నారు. త్రిభువన్ విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన పర్యటన చాలా విజయవంతంమైందన్నారు.
నేపాల్ చేపట్టిన భారత పర్యటన పూర్తిగా విఫలమైందని, సిగ్గుచేటని మాజీ ప్రధాని పుష్పకమాల్ దహాల్ అలియాస్ ప్రచండ అన్నారు. దీనిపై ప్రధాని స్పందిస్తూ.. పర్యటనకు ముందు పలు రకాలుగా వ్యతిరేకత వ్యక్తమైంది. అయితే, ఈ పర్యటన సక్సెస్ కావడం పట్ల చాలా సంతోషంగా ఉందన్నారు.
ముఖ్యంగా.. ఇరు దేశాల మధ్య ఇప్పటి వరకు ఉన్న సంబంధాలకు సరికొత్త కోణం ఆవిష్కృతమైందన్నారు. ఇరు దేశాల ప్రతినిధుల మధ్య బహుకోణాల్లో చర్చలు జరిగాయన్నారు. పరస్పర సంబంధాలపై ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చర్చించినట్టు చెప్పుకొచ్చారు.