తైవాన్‌లో ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు

మొరకోత్ తుపాను సృష్టించిన భీభత్సం నుంచి తైవాన్ క్రమక్రమంగా కోలుకుంటోంది. తుపాను బాధితులను ఆదుకునేందుకు తైవాన్ అధికారిక యంత్రాంగం ముమ్మర చర్యలు చేపట్టింది. మొరకోత్ తుపాను తైవాన్‌లో భీభత్సం సృష్టించి తొమ్మిది రోజులు గడిచాయి. తుపాను బాధిత ప్రాంతాల్లో సైనికులు రంగంలోకి సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

సోమవారం సైనిక సిబ్బంది తుపాను ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకొని ఉన్న పౌరుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు 1600 మంది పౌరులను హెలికాఫ్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తైవాన్ అధికారిక యంత్రాంగం తెలిపింది. ఇదిలా ఉంటే తుపాను కారణంగా మృతి చెందినవారి సంఖ్య 126కి చేరుకుందని అధికారిక వర్గాలు తెలిపాయి.

వాస్తవ మృతుల సంఖ్య 500లకుపైగా ఉండవచ్చని దేశాధ్యక్షుడు మా యింగ్ జెవ్ చెప్పారు. తుపాను కారణంగా కురిసిన భారీ వర్షాలతో హసియోలిన్ అనే గ్రామంపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ గ్రామంలో 300 మందికిపైగా పౌరులు శిథిలాల్లో చిక్కుకొని ఉంటారని అధికారిక వర్గాలు భావిస్తున్నాయి. ఈ గ్రామంలో జరిగిన ప్రాణనష్టాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి