ఇరాన్ అధ్యక్షుడు మహమౌద్ అహ్మదీనెజాద్ కొత్త మంత్రివర్గం బుధవారం కొలువుతీరనుంది. ఈ ఏడాది జూన్లో జరిగిన వివాదాస్పద ఎన్నికల్లో అహ్మదీనెజాద్ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో నెజాద్ అక్రమమార్గాల్లో గెలిచారని ఆరోపిస్తూ ఆయన ప్రత్యర్థులు దేశంలో కొన్నివారాల పాటు పెద్దఎత్తున ఆందోళన చేశారు.
అయితే ఇరాన్ శక్తివంతమైన గార్డియన్ కౌన్సిల్, ఎన్నికల సంఘం నెజాద్ ఎన్నికల న్యాయబద్ధమేనని ధృవీకరించడంతో ఆయన ఇటీవల వరుసగా రెండోసారి దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఇరాన్లో ఇస్లామికి విప్లవం జరిగిన తరువాత మళ్లీ తాజా అధ్యక్ష ఎన్నికల సందర్భంగానే పెద్దఎత్తున హింసాత్మక సంఘనటలు జరిగాయి.
ఎన్నికలకు సంబంధించిన హింసలో 20 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఎన్నికల అనంతరం చెలరేగిన ఆందోళనను పూర్తిగా అణిచివేయడంలో ఇరాన్ అధికారిక యంత్రాంగం విజయవంతమైంది. తాజాగా అహ్మదీనెజాద్ కొత్త మంత్రివర్గం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.
బుధవారం ఏర్పాటయ్యే కొత్త మంత్రివర్గంలో 21 మంది సభ్యులు ఉంటారు. నెజాద్ ఆదివారం ఇందులో ఆరుగురు సభ్యులను ప్రకటించారు. కొత్త మంత్రివర్గంలో ముగ్గురు మహిళలకు కూడా చోటు కల్పించనున్నారు. ఇరాన్ మంత్రివర్గంలో మహిళలకు చోటు కల్పించడం 30 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి.