నేపాల్ ఊచకోత కేసు మరో వింత మలుపు

నేపాల్ రాజు బీరేంద్ర, ఆయన కుటుంబసభ్యుల ఊచకోత కేసు తాజాగా మరో మలుపు తిరిగింది. నేపాల్ రాజధాని ఖాట్మండులోని ప్రముఖ మీడియా క్లబ్‌లో సోమవారం 59 ఏళ్ల వ్యక్తి ఒకరు తానే బీరేంద్ర, ఆయన కుటుంబం ఊచకోతకు వ్యూహరచన చేశానని అంగీకరించాడు. అతని పేరు తుల్ ప్రసాద్ షెర్చాన్.

బీరేంద్ర హయాంలో ఇంటలిజెన్స్ బ్యూరో అధిపతిగా పనిచేశానట్లు తుల్ ప్రసాద్ మీడియా క్లబ్‌లో చెప్పుకొచ్చాడు. ఎనిమిదేళ్ల క్రితం రాజ కుటుంబం ఊచకోత వెనుక అసలు సుత్రధారిని తానేనని, దేశాన్ని కాపాడేందుకు ఈ పని చేశానని తెలిపాడు. వాస్తవానికి 1975లోనే నేపాల్ రాజ కుటుంబం హత్యలకు బీజం పడిందన్నాడు.

అయితే ఈ మాటలను అక్కడి వారెవరూ నమ్మలేదు. పోలీసులు మాత్రం తరువాత రోజు స్పందించి, షెర్చాన్‌ను గత గురువారం అరెస్టు చేశారు. ఊచకోత కుట్రకు సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని ఐఏఎన్ఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షెర్చాన్ చెప్పాడు. విదేశాల నుంచి నేపాల్‌కు వచ్చే ఆర్థిక సాయాన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించకుండా రాజ కుటుంబం వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకునేదని ఆరోపించాడు.

ఈ నేరం చేసినందుకు రాజ కుటుంబాన్ని హతమార్చానని షెర్చాన్ చెప్పాడు. ఇదిలా ఉంటే నేపాల్ రాజ కుటుంబం హత్యలకు గతంలోనూ చాలా కోణాల్లో కథనాలు వెలువడ్డాయి. తాజాగా షెర్చాన్ చేసిన వ్యాఖ్యలను నేపాల్ మీడియా పెద్దగా పట్టించుకోలేదు. నేపాల్‌లో ప్రధాన ప్రతిపక్షమైన మావోయిస్టు పార్టీ మాత్రం దీనిపై సమగ్ర విచారణకు డిమాండ్ చేస్తోంది.

వెబ్దునియా పై చదవండి