దివంగత మాజీ నియంత సద్దామ్ హుస్సేన్కు చెందిన బాత్ పార్టీ మద్దతుదారుడు ఒకరిని ఇరాక్ మిలిటరీ అరెస్టు చేసింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్లో గత వారం జరిగిన బాంబు దాడుల ప్రధాన సూత్రధారి ఇతనేనని ఇరాక్ మిలిటరీ ఆదివారం వెల్లడించింది. గత వారం ఇరాక్ రాజధానిని వణించిన ఈ బాంబు పేలుళ్లలో 87 మంది మృతి చెందగా, వెయ్యి మందికిపైగా గాయపడ్డారు.
ఈ హింసాకాండకు తానే వ్యూహరచన చేసినట్లు అరెస్టు చేసిన నిందితుడు అలీ కాదీమ్ ఇబ్రహీం అంగీకరించాడని ఇరాక్ మిలిటరీ అధికారి ఒకరు ఆదివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అమెరికా సైన్యం ఇరాక్లో యుద్ధం ప్రారంభించిన తరువాత తాను సిరియాకు పారిపోయానని, తిరిగి ఫిబ్రవరి 2007లో స్వదేశానికి వచ్చానని ఇబ్రహీం విచారణలో తెలిపాడు.
ఈ నెల క్రితం బాత్ పార్టీ సభ్యుడొకరు తనకు ఫోన్ చేసి బాగ్దాద్లో బాంబు దాడులు చేయాలని కోరినట్లు ఇబ్రహీం చెప్పాడు.
బాగ్దాద్కు వంద కిలోమీటర్ల దూరంలోని మాఖ్దాదియాలో మరో పార్టీ సభ్యులు ట్రక్కు బాంబులు తయారు చేశారని, పేలుడు పదార్థాలు నింపిన ఈ ట్రక్కులను బాగ్దాద్కు తీసుకొచ్చేందుకు తనకు 10 వేల డాలర్లు చెల్లించినట్లు ఇబ్రహీం పేర్కొన్నాడు. ఇబ్రహీం బాగ్దాద్ తీసుకొచ్చిన ట్రక్కులతో ఇరాక్ ఆర్థిక, విదేశాంగ శాఖ కార్యాలయాల వద్ద బుధవారం బాంబు పేలుళ్లు జరిపారు. ఈ పేలుళ్లలో 87 మంది మృతి చెందగా, 1200 మంది గాయపడ్డారు.