బాగ్దాద్‌లో వరుసగా రెండో రోజు బాంబు పేలుళ్లు

బాగ్దాద్‌లో వరుసగా రెండో రోజు కూడా బాంబు పేలుళ్లు సంభవించాయి. బుధవారంనాటి బాంబు పేలుళ్లు ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో భారీ విధ్వంసం సృష్టించడంతోపాటు, 100 మందికిపైగా పౌరుల ప్రాణాలు బలితీసుకున్న సంగతి తెలిసిందే. ఈ పేలుళ్లలో 500 మందికిపైగా గాయపడ్డారు.

ఇదిలా ఉంటే గురువారం జరిగిన సైకిల్ బాంబు దాడిలో ఇద్దరు పౌరులు మృతి చెందారు. మరో పది మంది గాయపడ్డారు. గురువారం ఉదయం 8 గంటల సమయంలో బాగ్దాద్ ప్రధాన వ్యాపార ప్రదేశంలోని ఓ రెస్టారెంట్ సమీపంలో సైకిల్ బాంబు పేలుడు సంభవించిందని అధికారిక వర్గాలు తెలిపాయి.

ముందురోజు ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకొని బాగ్దాద్‌లో వరుస బాంబు దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ బాంబు పేలుళ్లలో మృతి చెందినవారి సంఖ్య ఈ రోజు 101కి చేరుకుందని అధికారిక వర్గాలు తెలిపాయి. రెండు నెలల క్రితం అమెరికా సేనలు ఇరాక్ నగరాల శాంతి, భద్రతల పరిరక్షణ బాధ్యతలను ఇరాకీ సేనలకు అప్పగించాయి.

అమెరికా సేనలు ఇరాక్ నగరాల వెలుపలకు వెళ్లాయి. అప్పటి నుంచి ఇరాక్‌లో తీవ్రవాద హింసాకాండ మళ్లీ క్రమక్రమంగా పుంజుకుంటోంది. ఇరాక్ సేనల సామర్థ్యంపై ఇప్పటికే పౌరుల్లో భయాందోళనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో.. బుధవారంనాటి భారీ బాంబు దాడులు వారిని మరింత కలవరపెడుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి