మిస్ వెనిజులా స్టెఫానియా ఫెర్నాండెజ్ విశ్వసుందరి- 2009 కిరీటం దక్కించుకున్నారు. ఈసారి విశ్వసుందరి పోటీల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించిన ఢిల్లీ సుందరి ఎక్తా చౌదరి తుది 15 మందిలోకి అడుగుపెట్టడంలో విఫలమై అభిమానులను నిరాశపరిచారు.
బహమాస్లో అట్టహాసంగా జరిగిన విశ్వసుందరి పోటీలకు భారత ఆశలను మోసుకెళ్లిన ఎక్తా చౌదరి తుది రౌండులోకి అడుగుపెట్టడంలో విఫలమయ్యారు. టాప్ 15 స్థానాల్లో ఉండే సుందరులు విశ్వసుందరి కిరీటం కోసం పోటీ పడతారు.
ఈ టాప్- 15లో అల్బేనియా, ఆస్ట్రేలియా, బెల్జియం, క్రొయేషియా, చెక్ రిపబ్లిక్, డొమినికన్ రిపబ్లిక్, ఫ్రాన్స్, ఐస్లాండ్, కొసావో, ఫ్యూర్టో రికో, స్వీడన్, స్విట్జర్లాండ్, దక్షిణాఫ్రికా, అమెరికా, వెనిజులా దేశాల సుందరాంగులు చోటు దక్కించుకున్నారు.
వీరిలో మిస్ వెనిజులా స్టెఫానియా ఫెర్నాండెజ్ విశ్వసుందరి- 2009 కిరీటాన్ని కైవసం చేసుకుంది. వెనిజులాకు ఇది వరుసగా రెండో విశ్వసుందరి కిరీటం. ఈసారి మొత్తం 80 మంది భామలు విశ్వసుందరి పోటీల్లోకి అడుగుపెట్టారు. వీరిలో పదిహేను మందిని మాత్రమే తుది పోటీలకు ఎంపిక చేస్తారు.