పాకిస్థాన్లో రెండేళ్ల క్రితం అప్పటి అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఎమర్జెన్సీ (అత్యాయిక పరిస్థితి) విధించడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ముషారఫ్ ఎమర్జెన్సీ నిర్ణయం రాజ్యాంగబద్ధంకాదని స్పష్టం చేసింది. నవంబరు 2007లో దేశంలో ముషారఫ్ అత్యాయిక పరిస్థితి విధించడం అక్రమమని పాకిస్థాన్ సుప్రీంకోర్టు శుక్రవారం ప్రకటించింది.
పాకిస్థాన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇఫ్తికార్ చౌదరి నేతృత్వంలోని 14 మంది సభ్యుల ధర్మాసనం.. దేశ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ ఎమర్జెన్సీ విధించడం, చౌదరితోపాటు 60 మంది న్యాయమూర్తులను తొలగించి, వారి స్థానంలో తనకు అనుకూల న్యాయమూర్తులను నియమించుకోవడం రాజ్యంగ వ్యతిరేకమని తెలిపింది.
ఎమర్జెన్సీ సమయంలో ముషారఫ్ తీసుకొచ్చిన 37 ఆర్డినెన్స్ల భవితవ్యాన్ని దేశ పార్లమెంట్ నిర్ణయించాలని సుప్రీంకోర్టు సూచించింది. ముషారఫ్ ఎమర్జెన్సీ సమయంలో తీసుకొచ్చిన ఆర్డినెన్స్లలో వివాదాస్పద జాతీయ పునరేకీకరణ ఆర్డినెన్స్ కూడా ఉంది. ఈ ఆర్డినెన్స్ కింద పాకిస్థాన్ ప్రస్తుత అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, ఇతర పీపీపీ నేతలకు అవినీతి కేసుల నుంచి ముషారఫ్ విముక్తి కల్పించారు.
ముషారఫ్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ల భవితవ్యాన్ని నాలుగు నెలల్లో తేల్చాలని పాక్ ప్రభుత్వానికి తాజాగా సుప్రీంకోర్టు సూచించింది. ఈ ఆర్డినెన్స్లలో జాతీయ పునరేకీకరణ ఆర్డినెన్స్ను రద్దు చేస్తే, అసిఫ్ అలీ జర్దారీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ముషారఫ్ న్యాయవ్యవస్థలో కీలకమైన స్థానాల్లో ఉన్న 61 మంది న్యాయమూర్తులను తొలగించడం కూడా అక్రమమని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది.