పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్కు కష్టాలన్నీ ఒకేసారి చుట్టుముట్టుతున్నాయి. ఇప్పటికే ఆయన హయాంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులను తొలగించిన వ్యవహారంలో ఇస్లామాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెల్సిందే. తాజాగా, సింధ్ ప్రావీన్స్లో మరో కేసు నమోదైంది. ముషారఫ్ పాలన సమయంలో న్యాయవాదులు చేపట్టిన ఆందోళన సమయంలో 40 మంది మృతి చెందారు.
వీరి మృతికి ముషారఫే ప్రధాన కారణమంటూ సింధ్ హైకోర్టు సమన్లు జారీ చేసింది. ప్రస్తుతం లండన్లో ఉంటున్న ముషారఫ్తో పాటు.. ఎంక్యూఎం అధ్యక్షుడు అల్తాఫ్ హుస్సేన్, సింధ్ రాష్ట్ర అంతర్గత వ్యవహారాల శాఖామంత్రి వసీం అఖ్తర్కు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. వీరంతా నెలాఖరున ధర్మాసనం చేపట్టే విచారణ సమయంలో స్వయంగా హాజరుకావాలని సమన్లలో పేర్కొంది.