మెహసూద్ బతికే ఉన్నాడు: తాలిబాన్లు

పాకిస్థాన్ తాలిబాన్ చీఫ్ బైతుల్లా మెహసూద్, అతని ముఖ్య అనుచరుడు బతికే ఉన్నారని ఆ దేశ మీడియాలో వార్తలు వచ్చాయి. తాలిబాన్ ప్రత్యర్థులు జరిపిన కాల్పుల్లో బైతుల్లా మెహసూద్ సన్నిహితుడు హకీముల్లా మెహసూద్ మృతి చెందినట్లు పాకిస్థాన్ అధికారిక యంత్రాంగం భావిస్తోంది.

అంతకుముందు అమెరికా డ్రోన్ దాడిలో బైతుల్లా మెహసూద్ కూడా మృతి చెందాడని పాక్ యంత్రాంగం తెలిపింది. అయితే హకీముల్లా మెహసూద్ తాను, మెహసూద్ ఇద్దరం బతికే ఉన్నామని సోమవారం వెల్లడించాడు. ఓ గుర్తు తెలియని ప్రదేశం నుంచి హకీముల్లా మెహసూద్ వార్తాసంస్థలకు ఈ విషయాన్ని తెలియజేశాడు.

గత బుధవారం దక్షిణ వజీరిస్థాన్‌లోని తన మామ ఇంటిలో ఉన్న బైతుల్లా మెహసూద్‌పై అమెరికా డ్రోన్ దాడి చేసింది. ఈ దాడిలో బైతుల్లా మెహసూద్, అతని భార్య, మరో ఏడుగురు సహాయకులు మృతి చెందినట్లు తాము భావిస్తున్నామని పాకిస్థాన్, అమెరికా అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. అయితే హకీముల్లా వార్తా సంస్థలతో మేమిరువరం బతికే ఉన్నామని చెప్పడంతో గందరగోళం నెలకొంది.

వెబ్దునియా పై చదవండి