పాకిస్థాన్ పోలీసులు ఆదివారం సుఫీ ముహమ్మద్పై తీవ్రవాద అభియోగాలు నమోదు చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో పాకిస్థాన్లోని సమస్యాత్మక నార్త్వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్లో వివాదాస్పద శాంతి ఒప్పందం ద్వారా ఇస్లామిక్ చట్టాన్ని అమల్లోకి తేవడంలో సుఫీ ముహమ్మద్ కీలకపాత్ర పోషించారు.
సుఫీ మధ్యవర్తిత్వంతో ప్రావీన్స్ ప్రభుత్వం, తాలిబాన్ తీవ్రవాద గ్రూపుల మధ్య ఈ శాంతి ఒప్పందం కుదిరింది. అయితే కొన్ని వారాల క్రితం ఇరువర్గాలు ఈ శాంతి ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాయి. ప్రస్తుతం సమస్యాత్మక స్వాత్ లోయ, దాని పరిసర ప్రాంతాల్లో తాలిబాన్ తీవ్రవాదులపై పాక్ ప్రభుత్వం సైనిక చర్య చేపట్టింది.
ఇటీవల పాక్ పోలీసులు తీవ్రవాదులకు మద్దతు ఇవ్వడంతోపాటు, స్వాత్ లోయలో హింసాకాండను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలపై సుఫీ ముహమ్మద్ను, ఆయన కుమారులను అరెస్టు చేశారు. తాజాగా పోలీసులు సుఫీ మొహమ్మద్పై తీవ్రవాదులకు సాయం చేస్తున్నందుకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నందుకు అతివాద మతపెద్ద సుఫీ ముహమ్మద్పై క్రిమినల్ కేసులు పెట్టారు.
సుఫీ మొహమ్మద్ను పాకిస్థాన్ పోలీసులు గత నెల 26న నార్త్వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావీన్స్ రాజధాని పెషావర్ శివార్లలో అరెస్టు చేశారు. ఏప్రిల్ 19న సుఫీ చేసిన ఓ ప్రసంగాన్ని ఆధారంగా చేసుకొని, ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆనాటి ప్రసంగంలో సుఫీ తనకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని, అదేవిధంగా పాక్ రాజ్యాంగం, దాని న్యాయవ్యవస్థ, పార్లమెంటరీ వ్యవస్థలపై కూడా తన విశ్వాసం లేదని పేర్కొన్నారు.