స్వాత్ లోయలో పాకిస్థాన్ సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ టెర్రరిస్ట్' కారణంగా తమ ఆవాసాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు చేరుకున్న 23 లక్షల మంది శరణార్థుల్లో 16 లక్షల మంది శరణార్థులు తిరిగి తమ సొంత ప్రాంతాలకు చేరుకున్నట్టు ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. దీంతో 13 శరణార్థ శిబిరాలను మూసి వేసినట్టు చెప్పారు.
స్వాత్ లోయలోని వివిధ ప్రాంతాల్లో తాలిబాన్ తీవ్రవాదులు తిష్టవేసి దుశ్చర్యలకు పాల్పడుతూ వచ్చిన విషయం తెల్సిందే. వీరిని ఏరివేసేందుకు పాక్ సైన్యం రంగంలోకి దిగింది. ఫలితంగా ఈ ప్రాంతాల్లో నివశించే ప్రజల్లో 23 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. వీరికోసం ప్రత్యేకంగా సమితి శరణార్థ శిబిరాలను ఏర్పాటు చేసింది.
ఈ నేపథ్యంలో తీవ్రవాదులను ఏరివేసిన తర్వాత తిరిగి శరణార్థులు తమ సొంత ప్రాంతాలకు చేరుకున్నట్టు సమితి వెల్లడించింది. దీనికి సంబంధించి న్యూయార్క్లో సమితి ప్రతినిధి విలేకరులతో మాట్లాడుతూ.. శరణార్థుల్లో 16 లక్షల మంది సొంత ప్రాంతాలకు చేరుకున్నారని చెప్పారు. భద్రత దృష్ట్యా మిగిలిన శరణార్థుల కోసం ఇంకా 17 శిబిరాలను కొనసాగిస్తున్నట్టు ఆయన తెలిపారు.