ఐపీఎల్‌లో అదరగొడుతున్న కోహ్లీసేన.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై గెలుపు

మంగళవారం, 15 మే 2018 (11:31 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అనూహ్యంగా రాణిస్తోంది. భారీ అంచనాలతో బరిలోకి దిగి వరుస పరాజయాలతో డీలాపడుతూ వచ్చిన బెంగళూరు.. చివరి దశలో చెలరేగుతోంది. ఇందులో భాగంగా కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై విజయం సాధించి ప్లే ఆఫ్‌ ఆశల్ని సజీవం చేసుకుంది. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన రసవత్తర మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
 
టాస్‌ గెలిచిన రాయల్‌ ఛాలెంజర్స్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌కు బ్యాటింగ్‌ అప్పగించాడు. కింగ్స్‌ ఆటగాడు రాహుల్‌ గేల్‌ దూకుడుగా ఆడినా.. ఒకే ఓవర్లో రాహుల్‌ 21, క్రిస్‌ గేల్‌ 18 పరుగులు చేసి పెవిలియన్‌ చేరుకోవడంతో పంజాబ్‌ పతనం ప్రారంభమైంది. ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్‌లు సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కావడంతో కింగ్స్‌ పంజాబ్‌ 88 పరుగులకే పరిమితమైంది. ఆర్సీబీ పేసర్‌ ఉమేష్‌ యాదవ్‌ మూడు వికెట్లు, సిరాజ్‌, చాహల్‌, గ్రాండ్‌హోమ్‌, మొయిన్‌ అలీ తలో వికెట్‌ పడగొట్టారు. 88 పరుగల స్పల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు..  ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా లక్ష్యాన్ని చేధించింది. 
 
విరాట్‌ కోహ్లి 28 బంతుల్లోనే 48 పరుగులతో నాటౌట్‌ నిలిచాడు. ఇక పార్థీవ్‌ పటేల్‌ 40 పరుగులతో .. కెప్టెన్ కోహ్లీకి అండగా నిలిచాడు. ఈ మ్యాచ్‌తో కింగ్స్ ఎలెవన్ ప్లే ఆఫ్ ఆవకాశాలను సంక్లిష్టం చేసుకోగా.. ఆర్సీబీకి మాత్రం రన్ రేట్ గణనీయంగా మెరుగైంది. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన ఉమేష్‌యాదవ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. మ్యాచ్‌ గెలుపుతో ప్లే ఆఫ్‌ ఆశలు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సజీవం చేసుకుంది. ఆడబోయే రెండు మ్యాచ్‌ల్లో కొహ్లీ సేన గెలిస్తే.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం చేసుకున్నట్లవుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు