హ్యాట్సాఫ్ టు ధోనీ ... ఇక చెన్నై సింహాలను నిలువరించడం కష్టమే : బ్రెట్ లీ

బుధవారం, 7 అక్టోబరు 2020 (14:43 IST)
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్‌పై ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ ప్రశంసల వర్షం కురిపించారు. హ్యాట్సాఫ్ టు ఎంఎస్‌డీ అంటూ ట్వీట్ చేశాడు. పైగా, ఆటగాళ్లపై నమ్మకం ఉంచడంలో ధోనీ తర్వాతే ఎవరైనా అంటూ కితాబిచ్చాడు. ధోనీపై బ్రెట్ లీ అలా ప్రశంసలు కురిపించడానికి బలమైన కారణం లేకపోలేదు.
 
ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోని ఓపెనర్ షేన్ వాట్సన్‌పై ఎన్నో అంచనాలు ఉన్నాయి. వాట్సన్ ఎలా ఆడతాడోనన్న విశ్లేషణలూ చాలా వచ్చాయి. అయితే, తొలి నాలుగు మ్యాచ్‌లలో వాట్సన్ చేసింది కేవలం 52 పరుగులు. అంటే, సరాసరిన ఒక్కో మ్యాచ్ లో 13 చొప్పున మాత్రమే పరుగులు చేశాడు. దీంతో వాట్సన్‌ను తొలగించి, మరో ప్లేయర్‌ను ధోనీ ఎంచుకుంటాడని కూడా వార్తలు వచ్చాయి. అయితే... అలా జరగలేదు.
 
తాజాగా, ఆదివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో మొత్తం మారిపోయింది. చెన్నై జట్టు 175 పరుగులు ఛేజ్ చేయాల్సి వచ్చిన వేళ, తన సహచరుడు డూప్లెసిస్‌తో కలిసి వాట్సన్ ఒంటిచేత్తో మ్యాచ్‌ని గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో 53 బంతుల్లోనే వాట్సన్ 83 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. 
 
దీన్ని గుర్తుచేసిన బ్రెట్ లీ... "ధోనీలోని గొప్పతనం అదే. అతను తన ఆటగాళ్లను నమ్ముతాడు. వరుసగా వైఫల్యాలు చెందుతున్నా వారిని విడిచి పెట్టడు. ఓపెనర్లు ఫామ్‌లోకి రావడంతో ఇప్పుడిక చెన్నై సింహాలు నిశ్చింతగా నిద్రపోతాయి. విఫలమవుతున్నా వాట్సన్‌కు అవకాశాలు ఇవ్వడంలో ధోనీ ఏ మాత్రమూ వెనుకంజ వేయలేదు. హ్యాట్స్ ఆఫ్ టూ ఎంఎస్డీ. వాట్సన్‌లోని అసలైన ఆటగాడు బయటకు వచ్చాడు. తదుపరి గేమ్‌లలో చెన్నైని నిలువరించడం మరింత కష్టతరమవుతుంది" అంటూ బ్రెట్ లీ వ్యాఖ్యానించాడు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు