అల్లాను స్మరిస్తూ బక్రీద్.. ఈద్ ముబారక్

శుక్రవారం, 26 అక్టోబరు 2012 (14:03 IST)
FILE
ముస్లిముల పండుగల్లో బక్రీద్ పండుగ ఒకటి. ఈ పండుగకు ఈదుల్..అజహా, ఈదుజ్జహా, లేక బక్రీద్ అని కూడా అంటారు. ఇస్లాంలోని ఐదు ప్రధాన సూత్రాలలో ఒకటైన హజ్‌ ‌తీర్థయాత్రను ముస్లింలు చేయాల్సివుంటుంది. ఈనెల ప్రారంభంలోనే ముస్లిం ప్రజలు భక్తి ప్రపత్తులతో హజ్ తీర్థయాత్రకు బయలుదేరతారు.

హజ్ యాత్రకొరకు సౌదీ అరేబియా‌లోని మక్కా నగరానికి చేరుకుని మస్జిద్..ఉల్..హరామ్‌లో వున్న కాబా చుట్టూ 7 ప్రదక్షిణలు చేసి మసీదులో ప్రార్థనలు చేస్తారు. ఈ మసీదు కాబా గృహం చుట్టూ ఉంది. ప్రపంచంలోని ముస్లింలందరూ కాబా వైపు తిరిగి నమాజు (ప్రార్థనలు) చేస్తారు. దీనినే ఖిబ్లా అని కూడా అంటారు.

హజ్ తీర్థయాత్రకు వెళ్ళినవారు మక్కానుండి మదీనా (ముహమ్మద్ (సొ.అ.స) ప్రవక్త గోరీ ఉన్ననగరం)ను సందర్శిస్తారు. అల్లాహ్ ఆదేశానుసారం ఇబ్రహీం (సొ.అ.స) తన ఏకైక పుత్రుడైన ఇస్మాయిల్‌ను బలి ఇవ్వడానికి సిద్ధమౌతారు. ఆ సంప్రదాయాన్ని స్మరిస్తూ ముస్లింలు ఈ బక్రీద్ పండుగను జరుపుకుంటారు.

రంజాన్‌లాగే బక్రీద్ పండుగను కూడా ఖుద్బా (ధార్మిక ప్రసంగం)తో ఈద్గా‌లో సామూహిక ప్రార్థనలు జరుపుతారు. ఆతర్వాత వారు నెమరువేసే జంతువులను (ఒంటె, మేక, గొర్రె, ఎద్దు) మాత్రమే ఖుర్బానీ (బలి) ఇస్తారు. బలి ఇచ్చిన తర్వాత దానిని మూడు భాగాలుగా విభజించి ఒక భాగాన్ని పేదలకు, మరొక భాగాన్ని బంధువులకు పంచుతారు. ఇంకొక భాగాన్ని తమ కోసం ఉంచుకుంటారు. ముస్లింలు త్యాగానికి ప్రతీకగా ఈ బక్రీద్ పండుగను జరుపుకుంటారు.

వెబ్దునియా పై చదవండి