హజ్ యాత్రలో భాగంగా మక్కాను దర్శించడమనేది ఇస్లాం మతస్థుల ఆధ్యాత్మిక జీవితంలో మైలురాయి వంటిది. ఇంతటి ప్రాధాన్యతను సంతరించుకున్న హజ్ అనగా పవిత్రమైన వ్యక్తిని లేదా ప్రాంతాన్ని చేరుకోవడం. అలాగే హజ్ సాంప్రదాయాలను అనుసరించి అల్లాను పూజించడంగా ముస్లింలు భావిస్తారు. హజ్ యాత్ర వెనుక గల చరిత్రను పరిశీలించినట్లయితే, మహ్మద్ ప్రవక్త కాలం నాటి పుణ్యక్షేత్రానికి సాగించే యాత్రగా హజ్ యాత్ర పరిగణించబడింది. హడిత్ను అనుసరించి హజ్ మూలాలు అబ్రహమ్ కాలానికి చెందిన అనగా క్రీస్తు పూర్వం 2000 ప్రాంతానికి చెందినవిగా పేర్కొనబడింది. అలాగే జమ్ జమ్ బావి నెలకొన్న ప్రాంతాన్ని కనుగొన్న దేవదూత గేబ్రియల్, హజ్ యాత్ర విధివిధానాలను అబ్రహమ్ కుమారుడైన ఇస్మాయిల్కు బోధించారని విశ్వసిస్తుంటారు.
అల్లా తత్వసారం అవగతం కాకమునుపే మహ్మద్ ప్రవక్త నిరంతరం ఉమ్రాహ్ను జరిపేవారు. 632 సంవత్సరంలో మహ్మద్ ప్రవక్త తన అనుచరులతో మదీనా నుంచి మక్కాకు జరిపిన యాత్ర తొలి హజ్ యాత్రగా ప్రస్తావించబడింది. ఇస్లాం మతానికి గల ఐదు స్థంభాలలో హజ్ ఒకటిగా చెప్పబడింది. మక్కాకు చేరుకున్న అనంతరం ఇది అల్లా నివాసంగా మహ్మద్ ప్రవక్త ప్రకటించారు.
హజ్ యాత్రకు చేరుకోవాలసిన ఏర్పాట్లు :
తమ సమైక్యతాభావానికి సంకేతంగా యాత్రికులు బృందాలుగా హజ్ యాత్రలో పాలుపంచుకుంటారు. మక్కాకు ప్రయాణించే ముస్లింల కోసం కొన్ని విమానసేవా సంస్థలు ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటిస్తుంటాయి. ముస్లింలు మక్కాకు చేరుకుని హజ్ను పాటించేందుకు ప్రస్తుతం ఓడలు కూడా తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. హజ్ సందర్భంగా పురుష యాత్రికులు వదులుగా ఉండే శ్వేత వస్త్రాలను, పాదరక్షలను ధరించవలసి ఉంటుంది. మహిళా యాత్రికులు తమ హిజాబ్ నిర్వహణలో భాగంగా ముఖం లేదా చేతులను మాత్రమే కప్పి ఉంచే వస్త్రాలను ధరించవలసి ఉంటుంది.
WD
అల్లా ఎదుట రాజు, పేద తారత్యమాలు లేక అందరూ సమానమనే భావనను ఇహ్రామ్ వస్తధారణ కలిగిస్తుంది. అలాగే పవిత్రత, పాపాల తొలగింపుకు ఇహ్రామ్ సంకేతంగా నిలుస్తోంది. ఇహ్రామ్లోకి రూపాంతరం చెందే ప్రాంతాన్ని మిఖట్ అంటారు. ఇహ్రామ్ను ధరించిన యాత్రికులు గడ్డం చేసుకోరు, గోళ్లను కత్తిరించుకోరు. అదే సమయంలో సుగంధ భరిత వస్తువులను వినియోగించరు. వాగ్దానం చేయడం, తగాదాలు పెట్టుకోవడం, జీవ హింస మరియు లైంగిక కార్యకలాపాలలో పాల్గొనరు. మనసులో హజ్ యాత్ర సంకల్పం చోటు చేసుకోగానే యాత్రికులు తాల్బియాహ్ పేరుతో పిలవబడే ప్రార్థనను చేయడం మొదలుపెడతారు.
WD
ఆధ్యాత్మిక విధివిధానాలు మక్కాకు చేరుకున్న యాత్రికులు హజ్జీలుగా పిలవబడతారు. ఇబ్రహీం మరియు ఆయన భార్య హజర్ జీవితాలకు సంకేతంగా కొన్ని మతపరమైన కార్యక్రమాలను హజ్జీలు చేపడతారు. హజ్జీలు చేపట్టే కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా గల ముస్లింల సమైక్యతను సూచిస్తుంటాయి. పవిత్రమైన హజ్ ధుఆల్-హిల్లా చాంద్రమాసపు ఎనిమిదవ రోజున ప్రారంభమవుతుంది. మక్కాకు చేరుకున్నప్పటికీ ఇహ్రామ్ను ధరించని యాత్రికులు ఇబ్రహీమ్ వస్త్రాలను ధరించి, మక్కాను వీడి సమీపంలోని మినా పట్టణానికి చేరుకుంటారు. మిగిలిన రోజును అక్కడ గడుపుతారు. యాత్రికుల సౌకర్యార్థం సౌదీ ప్రభుత్వం వేల సంఖ్యలో తెల్లని గుడారాలను మినాలో ఏర్పాటు చేస్తుంది.
హజ్ తొలి రోజు యాత్రికులు తమ మొదటి తవాఫ్ను చేపడతారు. తవాఫ్లో భాగంగా పవిత్రమైన అల్ హరమ్లోకి ప్రవేశించే యాత్రికులు కాబ చుట్టూ ఏడు సార్లు తిరుగుతారు. తిరుగుతున్న ప్రతిసారి పవిత్రమైన హజ్ర్ అల్ అస్వాడ్ అనే నల్లని రాతిని చుంబిస్తారు. యాత్రికులు నడిచే మార్గాన్ని ముతాఫ్ అంటారు. తవాఫ్ను నిరాహారంగా పాటిస్తారు. నీటిని స్వీకరించవచ్చు. తవాఫ్ పూర్తి చేసిన అనంతరం కాబకు సమీపంలోని ముఖామ్ ఎ ఇబ్రహీమ్ ప్రాంతంలో యాత్రికులందరూ రెండు రకాత్ ప్రార్ధనలను చేస్తారు. యాత్రికులు రద్దీ అధికంగా ఉన్న రోజుల్లో మసీదులో ఎక్కడ నుంచైనా యాత్రికులు ప్రార్ధనలు చేయవచ్చు.
మరుసటి రోజు యాత్రికులు మినా నుంచి అరాఫత్ పర్వతానికి చేరుకుంటారు. హజ్ యాత్రలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్న అరాఫత్ పర్వతం పైన మహ్మద్ ప్రవక్త చివరి ఆధ్యాత్మిక ప్రవచనాన్ని ప్రపంచానికి అందించారు. అరాఫత్ పర్వతంపై మధ్యాహ్నం వేళను యాత్రికులు గడపని పక్షంలో వారి యాత్ర నిష్ఫలమైనట్లుగా భావిస్తారు. సూర్యాస్తమయం కాగానే యాత్రికులు అరాఫత్ను వీడి మినా మరియు అరాఫత్కు మధ్యన గల ముజ్దాలిఫాహ్ చేరుకుంటారు. మర్నాడు సైతాన్పై విసిరేందుకుగాను 49 రాళ్ళు ఇక్కడ సేకరించబడి ఉంటాయి.
WD
సైతానుపై తమకు గల వ్యతిరేకతకు నిదర్శనంగా యాత్రికులు ఇక్కడ రాళ్ళు విసురుతారు. ప్రతి యాత్రికుడు ఇక్కడ గల ప్రతి స్థంభాన్ని ఏడు సార్లు రాళ్ళతో కొట్టాలి. సైతానుపై రాళ్ళు విసిరిన అనంతరం ఒక జంతువును బలి ఇవ్వాలి. భగవంతునికి తన కుమారుని సమర్పించిన అబ్రహమ్ భక్తికి మెచ్చి, అతని కుమారునికి బదులుగా గొర్రెను స్వీకరించిన సంఘటనకు ఈ ఘట్టం సంకేతంగా నిలుస్తోంది. పదకొండవ రోజు మధ్యాహ్నం మినాలోని మూడు జమారత్లపై ఏడేసి చొప్పున రాళ్ళను యాత్రికులు మరోసారి విసురుతారు. మరుసటి రోజు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది.