మానవ మహోపకారి ముహమ్మద్ (స) మహానీయులు దైవప్రవక్తగా నియమితులైన దగ్గరి నుండి ఇహలోకం వీడే వరకు దైవ సందేశాన్ని ఆయన దాసులైన మానవాళికి అందించడంలో నిమగ్నమై ఉండేవారు. రేయనక, పగలనక అనుక్షణం ప్రజాసంక్షేమం కోసం, వారి ఇహపర సాఫల్యం కోసమే యోచించేవారు. ప్రజల్ని అన్నిరకాల దుర్మార్గాల నుండి రక్షించి సన్మార్గ పథంపై, నిజధర్మంపైన నడిపించడానికి ఎనలేని కృషి చేసేవారు.
ఆ మహానీయులు తన కర్తవ్య నిర్వహణలో ఏనాడూ ఎలాంటి లోటూ రానీయలేదు. దైవం తనకప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా సమస్త మానవజాతికీ అందజేసి తరువాతి తరాలకు ఆదర్శంగా నిలిచారాయన. ఆ మమతల మూర్తి ఒక్కొక్క ఆచరణ విధానం నేడు మనకు ఆదర్శం కావాలి. ఆయన నడవడిలో గుబాళించిన వివేక విజ్ఞత కుసుమాలు మనలోనూ పరిమళించాలి.
ఆ మహనీయుడు కురిపించిన మమతానురాగాలు, క్షమాగుణం త్యాగభావం, మృదుభాష్యంలాంటి సుగుణాలు కనీస స్థాయిలోనైనా ఆచరించగలగాలి. అసహనం, ఆగ్రహం, చిరాకు, చపల చిత్తం ఆయన అనుయాయులకు ఎంతమాత్రం శోభించని లక్షణాలు. ఆయన గుణగణాలను గురించి పవిత్ర ఖురాన్.... 'మీరు గనక మృదుస్వభావి, మృదుభాషికాక పోయినట్లయితే మీ చుట్టూ ప్రజలు ఇంతగా మూగే వారు కాదు' అంటోంది.
ఒకసారి మక్కాలో ఓ అంతర్జాతీయ సమావేశం జరుగుతోంది. రోమ్, ఈరాన్ తదితర దేశాలకు చెందిన దేశాధి నేతాలు మహమ్మద్ ప్రవక్త (స)తో భేటీ అయ్యారు. అంతర్జాతీయ సమస్యలపై కీలకమైన చర్యలు జరుగుతున్నాయి. అంతలో ఒక ముసలమ్మ మూటాముల్లె సర్దుకొని ఊరు విడిచి వెళ్లిపోతూ, బరువు మోయలేక అక్కడ ఆగి సహాయం కోసం అర్థించింది. విదేశీ చక్రవర్తులతో కీలక సమావేశంలో ఉన్న ప్రవక్త మహనీయులు ఆమె మాటలు విని బయటికి వచ్చారు.
అమ్మా! ఏమిటి విషయం అని ఆరాతీశారు. 'బాబూ! ఈ మూటలు చాలా బరువుగా ఉన్నాయి. మోయలేక పోతున్నాను. ఎవరూ నన్ను పట్టించుకోవడం లేదు. కాస్త నువ్వైనా సాయం చేసి పుణ్యం కట్టుకో బాబూ!' అని అభ్యర్థించింది. అయ్యో, ఇదేమంత భాగ్యం. నేను సాయం చేస్తానంటూ ముహమ్మద్ ప్రవక్త (స) ఆ బరువైన మూటలు నెత్తిన ఎత్తుకొని ఆమె కోరిన చోటుకి చేర్చారు. అప్పుడామె, 'బాబూ! నీ పేరేమిటో గాని, దేవుడు నిన్ను చల్లగా చూడాలి.
ఎవరూ పట్టించుకోని, నిస్సహయస్థితిలో ఉన్న వృద్దురాలికి ఇలాంటి సాయం చేశావు. నీ మేలు ఎన్నటికీ మరిచిపోలేను. అని దీవిస్తూ, 'బాబూ! ఒక చిన్నమాట, ఈ ఊళ్లో ఎవరో ముహమ్మద్ అట, ఏదో కొత్త మతప్రచారం చేస్తున్నాడట, మన తరతరాల ఆచార సంప్రదాయాలను వ్యతిరేకిస్తున్నాడట అతని మాటలు విన్న వాళ్లు విన్నట్లు అతని మాయలో పడిపోతున్నారట.
జాగ్రత్త నాయనా, అతని వలలో చిక్క మాకు. నేను కూడా అతని మాయ మాటల్లో పడకూడదనే ఊరొదిలి వెళ్లిపోతున్నాను' అన్నది. ఎంతో ఓపిగ్గా ముసలమ్మ చెప్పిందంతా విని 'సరేనమ్మా ఇక నేను వెళ్లోస్తా జాగ్రత్తగా వెళ్లు' అంటూ సెలవు తీసుకొంటుండగా, 'బాబూ! నీ పేరైనా చెప్పు నాయనా కలకాలం గుర్తుంచుకుంటాను' అన్నది ముసలమ్మ.
'అమ్మా! ఏ ముహమ్మద్కు భయపడి, అతడికి ముఖం కూడా చూపించకూడదని నువ్వు ఊరువిడిచి వెళుతున్నావో, ఆ దౌర్భాగ్యుణ్ని నేనేనమ్మా. నన్ను మన్నించు' అన్నారు కారుణ్యమూర్తి (స) తలవంచుకొని వినయంగా దీంతో ఆ ముసలి అవ్వ ఒక్కసారిగా అవాక్కయిపోయింది. కొద్దిసేపటి తరువాత తేరుకున్న ఆమె, 'అయితే నేను విన్నదంతా అబద్ధం. ఒక వృద్దురాలి పట్ల ఈ విధంగా ప్రవర్తించిన వ్యక్తిని గురించి కీడు ఊహించడం కూడా పాపమే. బాబూ ముహమ్మద్! ఇకనేనెక్కడికీ వెళ్లను. ఇక్కడే ఉంటాను' అని ప్రవక్త వారికి ప్రియ శిష్యురాలిగా మారిపోయింది.