ముస్లింల పవిత్ర పండుగల్లో ఒకటైన బక్రీద్ను ముస్లిం సోదరులు శుక్రవారం దేశ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ పండుగ సందర్భంగా జరిగే ఈదుల్జుహా ప్రత్యేక ప్రార్థనల కోసం వివిధ ప్రభుత్వాలు, మైనారిటీ సంక్షేమ శాఖలు ఏర్పాట్లు పూర్తి చేశాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ విషయంపై మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి షబ్బీర్ ఆలీ మాట్లాడుతూ ఈద్గా మైదానంలో బక్రీద్ ప్రార్థనలు జరుగుతాయన్నారు.
ప్రార్థనల కోసం తీసుకొచ్చే జానిమాన్లను బ్యాగుల్లో కాకుండా చేతుల్లోనే పట్టుకుని తీసుకు రావాలని ఆయన సూచించారు. ప్రార్ధనలు జరిగే మైదానంలోకి బ్యాగులు, ఇతర సామగ్రిని అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. అలాగే దేశ వ్యాప్తంగా ఉన్న ప్రఖ్యాత మసీదుల్లోను ఈదుల్జుహా ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ముస్లీం సోదరులు ఒకరికొకరు శుభాంకాక్షలు తెలుపుకున్నారు.