దైవాభీష్టమైన జీవితం గడిపితే దేవుని ప్రేమకు పాత్రులవుతారట!

ఒక మనిషి దేశాంతరం వెళుతున్నాడు. ఆ కాలంలో ఒంటెలపైనే ప్రయాణం. సుదీర్ఘ ప్రయాణానికి సరిపడా సమస్త సరంజామా సర్దుకొని బయలుదేరాడు. ఆహారం, నీళ్లు, దుస్తులు, పైకం అన్నీ ఒంటెపైనే ఉన్నాయి. కొండలు, కోనలు, అడవిమార్గాన ప్రయాణం. ప్రయాణ క్రమంలో మార్గమధ్యంలో అనూహ్యంగా ఒంటె తప్పిపోయింది. చుట్టూ దట్టమైన అడవి. కనుచూపు మేరలో ఎక్కడా జన సంచారమే లేదు. ఒంటరిగా, సాధ్యమైనంత వరకు అడవినంతా గాలించాడు.

ఎక్కడా ఒంటె జాడ కనిపించలేదు. ఆహారం, మంచినీరు, నగదు అన్నీ దానిపైనే ఉన్నాయి. కనీసం గొంతు తడుపుకోవడానికి కూడా చుక్క నీరులేదు. ఆకలి, దాహం, భయం, అలసట. ఒంట్లో ఏమాత్రం సత్తువ లేదు. నీరసం ఆవహించింది. ఏం చేయాలో ఏమీ అర్థంకాక, ఇక వెతికే ఓపిక నశించి ఓ చెట్టుకింద కూలబడ్డాడు. బాగా అలసి పోయి ఉండడంతో వెంటనే నిద్రముంచుకు వచ్చింది. క్షణాల్లో గాఢనిద్రలోకి జారుకున్నాడు.

తర్వాత ఎప్పటికి మెలకువ వచ్చిందో..? కళ్లు తెరిచి చూడగానే ఎదురుగా తప్పిపోయిన ఒంటె దర్శనమిచ్చింది. ఆహారం, మంచినీళ్లు, దుస్తులు, నగదు సంచి.. అన్నీ భద్రంగా ఉన్నాయి. కొన్ని క్షణాలపాటు తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. ఇది కలా, నిజమా అన్న సంశంలో పడిపోయాడు. ఎట్టకేలకు ఇది నిజంగా నిజమేనని నిర్దారించుకున్నాడు.

అప్పుడు ఆ మనిషి మనోస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మమతల మూర్తి ముహమ్మద్ ప్రవక్త (స) ఈ సంఘటనను సహచరులకు వినిపించి, ఆ వ్యక్తి మానసిక స్థితి ఎలా ఉంటుంది? అని ప్రశ్నించారు.

అప్పుడు అనుచరులు 'దైవ ప్రవక్తా! ఇక ఆ వ్యక్తి ఆనందానికి అవధులే ఉండవు. జీవితంపై ఆశలు వదులుకున్న అతను ఎంతగా సంతోషిస్తాడో మేము మాటల్లో చెప్పలేము. అమితమైన సంతోషంతో అతని హృదయం ఉప్పొంగి పోతుంది' అని విన్న వించుకున్నారు.

అప్పుడు ప్రవక్త మహనీయులు "దారి తప్పిన ఒక వ్యక్తి నిజం తెలుసుకుని తనవైపుకు మళ్లినప్పుడు దైవం కూడా అలాగే సంతోషిస్తాడు" అని సెలవిచ్చారు.

ఒక సందర్భంలో ఆయన మరో ఉదాహరణచెబుతూ, 'ఒక మహిళకు రెండు మూడేళ్ళ చిన్నపిల్లవాడున్నాడు. ఒకసారి ఆపిల్లవాడు ఆడుకుంటూ వెళ్లి ఎక్కడో తప్పిపోయాడు. విషయం తెలిసి తల్లి తల్లడిల్లిపోయింది. బిడ్డకోసం వెదకని ప్రదేశం లేదు. కనిపించిన ప్రతివారినీ తన బిడ్డ గురించి వాకబు చేసింది.

ఒకరకంగా బిడ్డ ప్రేమలో పిచ్చిదైపోయింది ఆ తల్లి. కంటికి కనబడ్డ ప్రతి పిల్లవాణ్ణి ఎత్తుకుని గుండెలకు హత్తుకునేది. ముద్దులు కురిపించేది. అలాంటి పరిస్థితిలో ఆమెకు తన బిడ్డ కనిపిస్తే ఆమె మనోస్థితి మరెలా ఉంటుందో! ఆ తల్లి తన బిడ్డను పట్టించుకోకుండా ఉంటుందా? లేక అగ్నిగుండంలోకి విసిరేస్తుందా?' అని ప్రశ్నించాడు.

అప్పుడు సహచరులు, 'దైవప్రవక్తా! ఆమె తన బిడ్డకోసం ఏమైనా చేస్తుంది. బిడ్డను అగ్నిలోకి తోయడం కాదు.. పసిబిడ్డ తెలియక అగ్నివైపు వెళుతున్నా, ఆమె బిడ్డను రక్షించుకుంటుంది. స్వయంగా అగ్నిలోకి దూకడానికైనా సిద్ధపడుతుంది కాని, బిడ్డకు ఆ ఛాయకూడా తగలనీయదు. ప్రాణప్రదంగా చూసుకుని పొంగిపోతుంది' అని చెప్పారు.

ఒక తల్లికి తన బిడ్డల పట్ల ఉండే ప్రేమకన్న అధికమైన ప్రేమ దైవానికి తన దసులపట్ల ఉంటుంది. తన దాసుల్లో ఏ ఒక్క మానవుడూ నరకంలోకి పోవడాన్ని దైవం ఇష్టపడడు. అందుకే మానవుల మార్గదర్శనం కోసం దైవం అనేక ఏర్పాట్లు చేశాడు. కనుక మానవులు ఇప్పటికైనా తమ తప్పు తెలుసుకుని దైవాభీష్టమైన జీవితం గడిపితే, దేవుని ప్రేమకు పాత్రులై ఇహ పరలోకాల్లో సాఫల్యం పొందగలరు.

వెబ్దునియా పై చదవండి