జియో దెబ్బ.. ఎయిర్ టెల్‌కు తలనొప్పి.. 54 శాతం లాభాలు క్షీణించాయ్

బుధవారం, 25 జనవరి 2017 (10:00 IST)
దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరుతో సంచలనం సృష్టించిన జియోతో ఎయిర్‌టెల్‌కు తలనొప్పి తప్పట్లేదు. దేశంలో అగ్రగామి టెలికాం సంస్థ అయిన ఎయిర్‌టెల్‌ ఆర్థిక ఫలితాలపై రిలయన్స్‌ జియో ప్రభావం విశేషంగా పడింది. డిసెంబరు 31వ తేదీతో ముగిసిన మూడో త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్‌ లాభం 54 శాతం క్షీణించింది. కంపెనీ కన్సాలిడేటెడ్‌ లాభం గత ఏడాది క్యు3లో 1108.10 కోట్ల రూపాయల నుంచి ఈ త్రైమాసికంలో 503.70 కోట్లకు పడిపోయింది. ఇది నాలుగు సంవత్సరాల కనిష్ట స్థాయిగా నమోదైనట్లు ఎయిర్‌టెల్ అధికారులు తెలిపారు. 
  
కానీ ఆదాయాలపరంగా ఎయిర్‌టెల్‌ మార్కెట్‌ వాటా చారిత్రక గరిష్ఠ స్థాయి 33 శాతానికి చేరిందని, భారత రాబడులు 1.8 శాతం, ఆఫ్రికా ఆదాయాలు 6 శాతం పెరిగాయని ఎయిర్ టెల్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇక డిసెంబరు 31 నాటికి ఎయిర్‌టెల్‌ సమీకృత నికర రుణభారం 24 శాతం పెరిగి 97,365.20 కోట్ల రూపాయలకు చేరింది. గత ఏడాది ఇదే సమయంలో రుణభారం 78,451.50 కోట్ల రూపాయలుంది. మొత్తానికి జియో దెబ్బతో ఎయిర్ టెల్ కష్టాల్లో కూరుకుపోయిందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి