వాట్సాప్‌ నూతన ప్రైవసీ విధానం.. ఏకపక్షంగా రుద్దడం ఆందోళనకరం

సోమవారం, 25 జనవరి 2021 (13:47 IST)
వాట్సాప్‌ నూతన ప్రైవసీ విధానాన్ని ఎంచుకునే విషయంలో యూరోపియన్‌ యూజర్లతో పోలిస్తే భారత యూజర్ల పట్ల మెసేజింగ్‌ యాప్‌ భిన్నంగా వ్యవహరిస్తోందని కేంద్ర ప్రభుత్వం సోమవారం ఢిల్లీ హైకోర్టుకు వివరించింది. భారత యూజర్లపై వాట్సాప్‌ తన ప్రైవసీ పాలసీలో మార్పును ఏకపక్షంగా రుద్దడం ఆందోళనకరమని కేంద్రం పేర్కొంది. 
 
ఫేస్‌బుక్‌ నేతృత్వంలోని వాట్సాప్‌ నూతన ప్రైవసీ విధానానికి వ్యతిరేకంగా ఓ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా అదనపు సొలిసిటర్‌ జనరల్‌ చేతన్‌ శర్మ న్యాయమూర్తి సంజీవ్‌ సచ్‌దేవ్‌ ఎదుట ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు.
 
తమ డేటాను ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ల్లో షేర్‌ చేయకుండా ఉండే అవకాశాన్ని భారత యూజర్లకు ఇవ్వకపోవడాన్ని శర్మ ఆక్షేపించారు. ఇది యూజర్ల సమాచార గోప్యత, సమాచార భద్రతకు భంగకరమని కోర్టుకు నివేదించారు. 
 
దీనిపై ప్రభుత్వం ఇప్పటికే నిర్థిష్ట సమాచారం అందచేయాలని వాట్సాప్‌ను కోరిందని తెలిపారు. ప్రభుత్వం కోరిన వివరాలపై త్వరలోనే స్పందిస్తామని వాట్సాప్‌ తరపు న్యాయవాది కపిల్‌ సిబల్‌ పేర్కొన్నారు. దీంతో ఈ పిటిషన్‌పై విచారణను హైకోర్టు మార్చి1కి వాయిదా వేసింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు