'ఉచితం' పొడిగిస్తున్నామంటూ మెసేజ్ రాలేదా? డోంట్‌వర్రీ అంటున్న రిలయన్స్ జియో

మంగళవారం, 3 జనవరి 2017 (13:56 IST)
రిలయన్స్ జియో వెల్‌కమ్ ఆఫర్ కింద మొబైల్ సేవలను పొందుతున్న ఖాతాదారులందరికీ ఆ సంస్థ సమాచారం తెలిపింది. వెల్‌కమ్ ఆఫర్ కింద జియో కస్టమర్లుగా ఉన్నప్పటికీ.. "మార్చి 31 వరకూ ఉచిత డేటా, వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు" అంటూ మీకు రిలయన్స్ జియో నుంచి స్మార్ట్‌ఫోన్‌కు మెసేజ్ రాలేదా? ఉచిత ఆఫర్‌పై మెసేజ్ రాకున్నా ఆఫర్ కొనసాగుతుందని ఆందోళన చెందుతున్న కస్టమర్లకు రిలయన్స్ జియో స్పష్టంచేసింది. 
 
ఈ మేరకు ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా)కు వివరణ ఇస్తూ, తామందించిన ప్రమోషనల్ ఆఫర్, న్యూ ఇయర్ ఆఫర్ వేరువేరని స్పష్టం చేసింది. అందువల్ల డిసెంబర్ 31 వరకూ ఇచ్చిన ఉచిత ఆఫర్‌కు తాజా ఆఫర్ కొనసాగింపు కాదని తేల్చి చెప్పింది. మొదటి ఆఫర్‌లో డేటా కోసం రీచార్జ్ చేసుకునే వెసులుబాటు లేదనీ, కానీ.. న్యూ ఇయర్ ఆఫర్ కింద డేటా కోసం రీచార్జ్ చేసుకునే సౌలభ్యం ఉందని ట్రాయ్‌కు వివరించింది. 
 
అయితే, వెల్‌కమ్ ఆఫర్ కింద ఉన్న జియో వినియోగదారులందరికీ కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా కొంతమందికి మెసేజ్ వెళ్లలేదని, ఈ విషయంలో కంగారు పడనక్కర్లేదనీ, మరో 90 రోజులు ఉచిత సేవలను అందుకోవచ్చని, వినియోగించిన డేటాకు బిల్లు పంపుతున్నట్టు వచ్చిన ఆరోపణలు నిజం కాదని తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి