టిక్ టాక్ పోయింది.. చింగారీ వచ్చింది.. నెటిజన్లకు పండగే

మంగళవారం, 30 జూన్ 2020 (22:58 IST)
Chingari
టిక్ టాక్ పోయిందని బాధపడిన నెటిజన్లు.. ప్రస్తుతం ఎగిరి గంతేస్తున్నారు. ఎందుకంటే..? చింగారీ అనే యాప్ వచ్చేసింది. భారత్-చైనా సరిహద్దుల్లో చోటుచేసుకున్న పరిణామాలు ఇరు దేశాల వాణిజ్యంపై దెబ్బతీసేలా వున్నాయి. తాజాగా భద్రతా కారణాల రీత్యా నష్టదాయకం అని భావించి 59 చైనా యాప్‌లపై కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో టిక్ టాక్, హలో యాప్ వంటి పాప్యులర్ యాప్‌లు నిలిచిపోయాయి. 
 
అయితే, టిక్ టాక్ ప్రభావంతో వీడియోలకు బాగా అలవాటు పడిన భారత నెటిజన్లు డీలా పడిపోయారు. అయితే టిక్ టాక్ పోతే పోయిందని.. దానికి బదులు ఇప్పుడు మరో యాప్ విశేషంగా ఆకర్షిస్తోంది. దీని పేరు 'చింగారీ'. ఇది దేశీయంగా రూపొందిన యాప్. దీన్ని మహీంద్రా గ్రూప్ అధినేత, టెక్ ప్రియుడు ఆనంద్ మహీంద్రా కూడా డౌన్ లోడ్ చేసుకోవడం విశేషం. ఈ యాప్ అచ్చం టిక్ టాక్ తరహాలోనే ఉంటుంది. 
 
టిక్ టాక్‌పై నిషేధంతో ఈ 'చింగారీ' యాప్‌కు డౌన్ లోడ్లు విపరీతంగా పెరిగిపోయాయి. 60 నిమిషాల వ్యవధిలో ఈ యాప్‌ను లక్ష మంది డౌన్ లోడ్ చేసుకున్నారట. ఇప్పటివరకు ఈ యాప్ 30 లక్షల డౌన్ లోడ్లు సాధించింది. అంతేకాదు, ఈ యాప్ వ్యూయింగ్ రేట్ కూడా ఎంతో మెరుగైంది. ఇది ఇంగ్లీష్, హిందీ, తెలుగు వంటి అనేక భారతీయ భాషల్లో లభ్యమవుతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు