సెలెబ్రిటీల ట్విటర్ ఖాతాలకు మళ్లీ బ్లూ టిక్క్ వచ్చేసింది...

ఆదివారం, 23 ఏప్రియల్ 2023 (16:53 IST)
సినీ సెలెబ్రిటీల ట్విటర్ ఖాతాలకు మల్లీ బ్లూ టిక్ వచ్చేసింది. అయితే, వీరంతా డబ్బులు చెల్లించారా లేదా ట్విటర్ పాలసీలో సడలింపులు ఇచ్చి తిరిగి బ్లూ టిక్ ఇచ్చారా అన్నది తెలియాల్సివుంది. ఇటీవల సినీ, రాజకీయ, క్రీడలతో సహా పలు రంగాలకు చెందిన ప్రముఖుల ఖాతాల బ్లూ టిక్‌‌ను ట్విటర్‌ తొలగించింది. కేవలం ట్విటర్‌ బ్లూ సర్వీస్‌లకు డబ్బులు చెల్లించిన వారికి మాత్రమే బ్లూ చెక్‌మార్క్‌ ఇచ్చింది. దీంతో చాలా మంది సెలబ్రిటీలు బ్లూ టిక్‌ను కోల్పోయారు. 
 
అయితే, ట్విటర్‌ యజమాని ఎలాన్ మస్క్‌ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బ్లూ టిక్‌‌ను ఇచ్చే విషయంలో కొన్ని మినహాయింపులు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. కనీసం 10 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న వ్యక్తుల ఖాతాలకు బ్లూ టిక్‌‌ను పునరుద్ధరించినట్లు తెలుస్తోంది. 
 
ఈ నేపథ్యంలో శుక్రవారం బ్లూ చెక్‌మార్క్‌ కోల్పోయిన చాలా మంది ప్రముఖుల ఖాతాల్లో ఆదివారం తిరిగి అది కనిపించడం గమనార్హం. బాలీవుడ్ తారలు షారుక్‌ ఖాన్‌, అలియా భట్‌, క్రికెటర్లు కోహ్లీ, ధోనీ సహా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, బిలియనీర్‌ బిల్‌ గేట్స్‌, రాజకీయ ప్రముఖులు రాహుల్‌ గాంధీ, అరవింద్‌ కేజ్రీవాల్‌ వంటి వారి ట్విటర్‌ ఖాతాలన్నింటికీ ఇప్పుడు బ్లూ టిక్‌ మార్క్‌ ఉండడం గమనార్హం. 
 
కొంతమంది ట్విటర్‌ ఖాతాలను తానే వ్యక్తిగతంగా చెల్లించి ట్విటర్‌ బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ సేవలను అందిస్తున్నట్లు ఎలాన్‌ మస్క్‌ చెప్పారు. లెబ్రాన్‌ జేమ్స్‌, విలియం శాట్నర్‌, స్టీఫెన్‌ కింగ్‌ వంటి వారి ఖాతాలకు తానే స్వయంగా డబ్బులు చెల్లిస్తున్నట్లు తెలిపారు. వీరంతా తాము ట్విటర్‌ బ్లూను సబ్‌స్క్రైబ్‌ చేసుకోబోమని బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు