వినూత్న మార్పులతో దూసుకుపోతున్న ప్రముఖ మెసెంజర్ వాట్సాప్ యూజర్ల కోసం మరో కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే వీడియో కాలింగ్, జిప్ షేరింగ్ వంటి సదుపాయాలతో వినియోగదారులకు బాగా చేరువైన వాట్సాప్ గ్రూప్ చాట్లో లైవ్ లొకేషన్ ఫీచర్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఐవోఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం.
దీని ద్వారా గ్రూపులోని మిగిలిన వ్యక్తులు ఎక్కడెక్కడున్నారో కూడా తెలుస్తుంది. దీంతోపాటు ఇతరులకు అది ఎంత సమయం కనిపించాలో కూడా నిర్ధేశించుకునే వీలు కల్పిస్తున్నారు. స్నేహితులంతా ఒక చోటుకు చేరాలనుకున్నప్పుడు ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది. ఒక స్థలానికి కొందరు చేరుకుని మరికొందరు దారి తేలిక ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఆ స్నేహితుడు ఎక్కడున్నాడో తెలుసుకునేందుకు ఈ సదుపాయం పనికొస్తుంది. మరికొద్దిరోజుల్లో ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లకు ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.