ఉద్యోగుల వేతనాలపై ఐటి దిగ్గజాల వేటు

సోమవారం, 1 సెప్టెంబరు 2008 (19:49 IST)
రాన్రానూ తమ క్లయింట్లు ఐటిపై వెచ్చిస్తున్న వ్యయాలు తగ్గిపోతుండటంతో ప్రముఖ బారతీయ ఐటి దిగ్గజాలు తమ ఖర్చులలో అత్యధిక భాగంగా ఉంటున్న ఉద్యోగుల వేతనాలపై వేటు వేయడానికి సిద్ధపడుతున్నాయి. దీంతో ఐటి కంపెనీల కార్మికశక్తిలో 0.5 నుంచి 10 శాతం మేరకు ఉన్న దిగువ స్థాయి ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం వచ్చి పడింది.

అగ్రశ్రేణి ఐటి కంపెనీలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, సత్యం, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ మరియు కాగ్నిజెంట్ సంస్థల్లో 4.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. రిజర్వ్ బెంచ్‌లలో ఉన్నవారు, శిక్షణ పొందుతున్న వారు మినహాయిస్తే, వీరిలో 60 శాతం మంది ఉద్యోగులు శాశ్వత ఉద్యోగులుగా ఉన్నారు. వీరిలో 1.5 శాతం మంది శాశ్వత ఉద్యోగులను తొలగించాలని కంపెనీలు భావించినట్లయితే, ఐటి దిగ్గజ సంస్థలనుంచి 4 నుంచి 5 వేలమంది వరకు ఉద్యోగులు ఇంటి దారి పట్టవలసి ఉంటుంది.

ఐటి కంపెనీల ఆదాయ పరిస్థితి బాగున్నప్పుడు కంపెనీ సీఈఓలు దిగువ స్థాయిలోని 1-5 శాతం మంది ఉద్యోగులను లక్ష్యంగా చేసుకునేవారు కారని, 2006-07 సంవత్సరాలలో ఇలాంటి ఆలోచనలు కూడా వారికి ఉండేవి కావని మా ఫోయ్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్స్ సిఇఒ బాలాజి అభిప్రాయ వ్యక్తం చేశారు.

పోటీలో సంస్థ ఉనికిని నిలబెట్టుకోవాలంటే ఉత్పాదకతా స్కేల్‌లో ఉద్యోగుల సంఖ్య కీలకపాత్ర వహిస్తుందని యాడ్ అస్త్రా కన్సల్టెంట్ ఎండీ నిరుపమా చెప్పారు. గత సంవత్సరంలో పనితీరు సరిగా లేని వారు సైతం 4-5 శాతం మేరకు జీతాల్లో మెరుగుదలను సాధించగా ఈసారి మాత్రం అలాంటి వారిని రాజీనామా చేయమని కోరుతున్నారని లేదా వారి జీతాల పెంపును కంపెనీలు పట్టించుకోవడం లేదని ఆమె చెప్పారు.

కాగా, మరొక దిగ్గజం ఇన్ఫోసిస్ మానవవనరుల విభాగం డైరెక్టర్ మోహన్‌దాస్ పాయ్ మాట్లాడుతూ 60 వేలమంది సంస్థ ఉద్యోగులలో 2 నుంచి 2.5 శాతం మంది పనితీరు బాగాలేదని రుజువవుతోందని వీరిలో 50 నుంచి 70 శాతం మంది ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటిదారి పట్టక తప్పదని ఆరకంగా పనితీరు మెరుగుదల పథకం అమలవుతుందని తేల్చి చెప్పారు.

మొత్తంమీద చూస్తే ఐటి ఉద్యోగుల హవా తగ్గుముఖం పడుతోందనడంలో సందేహమే లేదు.

వెబ్దునియా పై చదవండి