చచ్చువారలెవరు? చావని వారేరి?

శుక్రవారం, 25 ఫిబ్రవరి 2011 (20:33 IST)
చచ్చువారలెవరు? చావని వారేరి? చచ్చి బ్రతికియుండు జనములెవరు విచ్చలవిడిగాను వివరించి చూడరా విశ్వదాభిరామ వినురవేమ

తాత్పర్యము: మనుషులు రెండు రకాలు. మరణించేవారు, మరణించనివారు. మరణించనివారు కూడా ఉంటారా...? అంటే అవుననే చెప్పాడు వేమన. భౌతికంగా మరణించినా, ఆత్మపరంగా జీవించే ఉంటారు. వారెవరో ఎలాంటివారో అరలు పొరలు లేకుండా స్వేచ్ఛగా ఆలోచిస్తే, సత్యం తెలుస్తుంది అంటాడు వేమన.

చావడం, చావకపోవడం కేవలం శారీరకమే కాదు. అజ్ఞాని, మాయలో చిక్కినవాడు, వ్యామోహపరుడు, అహంకారి.. ఇటువంటి లక్షణాలున్నవాడు బతికి ఉన్నా చచ్చినవాడి కిందే లెక్క. మరి చావని వారెవరు..? అంటే, జ్ఞాని, యోగి, నిర్మలుడు, నిరహంకారి.. ఈ గుణాలు కలిగినవాడికి చావులేదు. అతడు నిత్యమూ అమరుడే.. అతని దేహం నశించినా ఆత్మ జీవిస్తుంది. కీర్తి ప్రకాశిస్తుంది అని చెప్పాడు యోగి వేమన.

వెబ్దునియా పై చదవండి