కృష్ణా పుష్క‌రాల‌కు విజ‌య‌వాడ వ‌స్తున్నారా? బస్సులు ఇక్కడి వరకే...

శుక్రవారం, 12 ఆగస్టు 2016 (12:37 IST)
విజయవాడ : కృష్ణా పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి విజయవాడకు వచ్చే బస్సులు, రైళ్లను నిలిపి ఉంచే ప్రాంతాలపై అధికారులు వివరంగా ప్రకటన జారీ చేశారు. ఆగస్టు 12 నుంచి నిర్దేశిత ప్రాంతాల్లో మాత్రమే నిలపాలని ఆర్టీసీ, రైల్వే అధికారులు తెలిపారు.
 
బస్సులు ఆపే ప్రాంతాలు
హైదరాబాద్ రూటు నుంచి వచ్చే బస్సులను ఇబ్రహీంపట్నం జాకీర్ హుస్సేన్ కాలేజ్ వరకు అనుమతిస్తారు. ఏసీ బస్సులకు విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వరకు అనుమతినిచ్చారు. తిరువూరు, మైలవరం నుంచి వచ్చే బస్సులకు ఇబ్రహీంపట్నంలోని వీటీపీఎస్ ఎ- కాలనీలో స్టాప్ ఏర్పాటు చేశారు. 
 
విశాఖపట్నం నుంచి వచ్చే బస్సులను వైవీ రావ్ ఎస్టేట్ వద్ద నిలిపివేస్తారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి వచ్చే బస్సులను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద నిలిపివేస్తారు. మచిలీపట్నం, అవనిగడ్డ వైపు నుంచి వచ్చే బస్సులను కానూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజ్ వద్ద ఆపేస్తారు. తిరుపతి నుంచి ఆ మార్గంలో వచ్చే బస్సులను గుంటూరు బస్ స్టేషన్ వరకు అనుమతిస్తారు. అక్కడి నుంచి గుంటూరు-విజయవాడ పుష్కర స్పెషల్ షటిల్ సర్వీసులుంటాయి. 
 
రైళ్లు నిలిపే ప్రాంతాలు
హైదరాబాద్ నుంచి వచ్చే పుష్కర స్పెషల్ ట్రైన్లను రాయనపాడు వరకు అనుమతిస్తారు. విశాఖపట్నం నుంచి వచ్చే పుష్కర స్పెషల్ ట్రైన్లను రామవరప్పాడు, గుణదల స్టేషన్లలో ఆపేయాలి. గుంటూరు వైపు నుంచి, తెనాలి వైపు నుంచి వచ్చే పుష్కర స్పెషల్ ట్రైన్లను కృష్ణా కెనాల్ జంక్షన్ వరకూ అనుమతిస్తారు. అక్కడ నుంచి పుష్కర్ స్పెషల్ బస్సుల్లో విజయవాడ చేరుకోవచ్చు.

వెబ్దునియా పై చదవండి