ప్రపంచంలో అన్ని దేవతామూర్తులను వారి రూపాల్లోనే కొలుస్తాం. అయితే చంద్రశేఖరుడిని మాత్రం లింగంగా పూజించడం విశిష్టత. సమస్త జగత్తును దహించివేసేందుకు సిద్ధమైన హాలాహలాన్ని గొంతుకలో దాచుకున్న నీలకంఠుడు. సహధర్మచారిణికి తన శరీరంలో అర్ధభాగమిచ్చిన అర్ధనారీశ్వరుడు. తనను యముని బారినుంచి రక్షించమని కోరిన భక్త మార్కండేయను చిరంజీవిగా జీవించమని వరాన్ని ఒసంగిన భక్తజన బాంధవుడు. మహేశ్వరుడిని, పరమేశ్వరుడి అనుగ్రహం లభించాలంటే.. శివరాత్రి రోజున పూజ చేసుకోవడం ఉత్తమం.
‘శివ’ అన్న పదానికి మంగళకరం.. శుభప్రదం అని అర్ధం. కైలాసనాథుడైన ఆ పరమేశ్వరుడు మహాశివరాత్రి నాడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణించబడుతోంది. భోళా శంకరుడు.. ఈశ్వరుడు లింగోద్భవం చెందిన పవిత్ర దినమే మహాశివరాత్రి. యావత్ సృష్టిని నడిపించే ఆ శంభుడే మాఘ మాసం బహుళ చతుర్ధశి రోజు అనంత భక్త కోటి కోసం శివలింగంగా ఆవిర్భవించాడని పురాణాలు చెప్తున్నాయి.
ఆ రోజున జాగరణ నిర్వహించాల్సి వుంటుంది. మహాశివరాత్రి పర్వదినాన లింగోద్భవానికి సంబంధించిన ఒక పురాణగాథ ఒకటి ఆచరణలో ఉంది. పూర్వం బ్రహ్మ, విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వివాదం ఏర్పడింది. అయితే ఈ వివాదం ఎప్పటికీ పరిష్కారం కాలేదు. ఈ సమయంలో ప్రళయకర్తయైన శివుడు గొప్ప జ్యోతిర్లింగంగా ఆవిర్భవించారు. ఆ మహా శివలింగానికి ఆది, అంతాలను బ్రహ్మ, విష్ణువులు కనిపెట్టలేకపోయారు. దీంతో వారికి కనువిప్పు కలిగింది.
నాగభూషణధారి పరమేశ్వరుడు లింగంగా ఆవిర్భించిన రోజే శివరాత్రిగా చెప్తుంటారు. శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ ఉండటం సనాతన సంప్రదాయం. శివరాత్రికి ముందు ఒక్క రోజు ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి. శివరాత్రి పర్వదినం నాడు ఉదయం స్నానాదులు పూర్తి చేసుకొని శివదర్శనం చేసుకొని శివనామస్మరణతో ఉపవాసం వుండాలి.
రాత్రివేళలో శివలింగానికి పూజలు చేస్తూ జాగరణ చేయాల్సి వుంటుంది. పూజా విధానం, మంత్రాలు తెలియకపోయినప్పటికీ ఉపవాసం, జాగరణం, బిల్వార్చన, అభిషేకంలాంటి వాటిలో పాల్గొంటే చాలు శివానుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తున్నారు. ఇలా చేస్తే అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. సకలసంపదలు చేకూరుతాయని వారు సూచిస్తున్నారు.