ప్రకృతి ముద్దుబిడ్డ "కక్కబె"

సోమవారం, 20 జులై 2009 (13:14 IST)
FileFILE
కాఫీ తోటలు.. ఏలకుల పరిమళాలు.. నారింజ పండ్ల తోటలు.. జలపాతాలు.. కొండలతో దోబూచులాడే మేఘాలు... పర్వతారోహకులకు అనువైన కొండలు.. ఇలాంటి చూడముచ్చటైన ప్రకృతి అందాలు ఆ ప్రాంతం సొంతం. కర్ణాటక రాష్ట్రంలోని కొడగు జిల్లాలోని 'కక్కబె' అనే గ్రామంలో ఈ రమణీయ దృశ్యాలు కొలువుదీరి ఉన్నాయి. అంతేకాదండీ.. ఆసియా ఖండంలోనే అత్యధిక పరిమాణంలో తేనె ఉత్పత్తి అవుతున్న ప్రాంతంగా కూడా ఈ కక్కబెకు మరో రికార్డు ఉంది.

ఈ ప్రాంతం.. ఓ కుగ్రామం..
ఈ ప్రాంతంలో ఎటువైపు చూసినా తేనె తుట్టెలే దర్శనమిస్తాయి. దేశ విదేశాల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుంటారు. ఈ ప్రాంతం ఓ కుగ్రామమైనప్పటికీ.. స్టార్ హోటళ్లు.. రిసార్టులు, రెస్టారెంట్లు వంటి అత్యాధునిక సౌకర్యాలను కూడా సొంతం చేసుకుంది. కాఫీ తోటల్లో ఉన్న పురాతన బంగళాలు.. స్టే హోంలుగా రూపుదిద్దుకున్నాయి.

FileFILE


కొడగు ప్రజల సంప్రదాయాలు.. ఆహారపు అలవాట్లు ఇక్కడ మరో ప్రత్యేకత. ఈ ప్రాంతంలో విస్తారంగా ఉండే కాఫీ తోటల్లో విహరిస్తూ.. రమణీయమైన ప్రకృతి అందాలను తిలకిస్తూ ఉంటే.. కాలం కరిగిపోవడం తెలియదని అంటారు సందర్శకులు. కాఫీ తోటలతో పాటు.. ఏలకుల తోటలు ఇక్కడ ప్రసిద్ధి. ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్న తడియాండల్ కొండలు పర్వతారోహకులకు స్వర్గధామంగా ఉంటాయి.

ఆకాశం నిర్మలంగా ఉన్న సమయంలో శిఖరం నుంచి చూస్తే అరేబియా సముద్రం ప్రత్యేక అందాలను సంతరించుకుందా అని
FileFILE
అనిపిస్తుంది. కక్కబెకు సమీపంలో ఉన్న సల్నాడ్ రాజప్రాసాదం మరో ఆకర్షణ. ఈ ప్రాంతాన్ని పాలించిన దొడ్డవీరరాజు ఈ రాజప్రాసాదాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. 18వ శతాబ్దం నాటి ఈ ప్యాలెస్‌ను చూసేందుకు పర్యాటకులు పోటీ పడుతుంటారు.

ఎలా వెళ్లాలి?
బెంగళూరు, మైసూరు నగరాల నుంచి మడికెరెకు బస్సు సదుపాయం ఉంది. అక్కడ నుంచి 25 కిలోమీటర్లు ప్రయాణిస్తే కక్కబె చేరుకోవచ్చు. ప్రైవేట్ బస్సులు, టాక్సీల సదుపాయం కూడా ఉంది. ఈ గ్రామంలో ఉన్న హోంస్టేలు, రిసార్టులు, హోటళ్లలో బస చేసేందుకు రోజుకు వెయ్యి నుంచి రూ.2500 వరకు వసూలు చేస్తుంటారు.