మౌంట్ ఆబూ - ఆకట్టుకునే పర్వత కేంద్రం

గురువారం, 30 ఆగస్టు 2007 (12:40 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని మౌంట్ ఆబూ ఉదయ్‌పూర్‌కు 156 కి.మీల దూరంలో ఉంది. మౌంట్ ఆబూకు దిల్వారా దేవాలయాలు, నక్కి తలవ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఏప్రిల్ నుంచి జూన్ అలాగే అక్టోబర్, నవంబర్ మాసాలు మౌంట్ ఆబూను సందర్శించడానికి అనుకూలంగా ఉంటుంది. రాజస్థాన్‌లోని ఏకైక పర్వత పర్యాటక కేంద్రం మౌంట్ ఆబూ. ఆరావళి పర్వతాలకు చివరగా నైఋతి దిశలో 1220 మీటర్ల ఎత్తున గ్రానైట్ పలకలతో నిండిన పర్వత సమూహల మధ్య మౌంట్ ఆబూ ఉంది.

దట్టమైన అడవులతో నిండిన పర్వతాలు చుట్టూ ఉండగా ఒక సరస్సుకు ఆవృతమై మౌంట్ ఆబూ నిర్మితమైంది. పురాణేతిహాసాలను అనుసరించి శివుని వాహనమైన నందీశ్వరుని కాపాడేందుకు అర్బుద పేరుగల సర్పము ఇక్కడకు వచ్చిందని కనుక ఈ ప్రాంతానికి సర్పం పేరు స్థిరపడి పోయిందని ఒక విశ్వాసం. ప్రఖ్యాతి గాంచిన దిల్వారా దేవాలయాలతో పాటు అనేక పురావస్తు శిథిలాలకు చిహ్నంగా మౌంట్ ఆబూ వాసికెక్కుతున్నది.

అంతేకాక అనేక విహార కేంద్రాలు, అలనాటి రాజుల సౌందర్య దృష్టికి, శృంగార కాంక్షకు తార్కాణంగా నిలిచే పలు ప్రాంతాలు మౌంట్ ఆబూలో పర్యాటకలను ఆకర్షిస్తున్నాయి. ఠీవిగా నిల్చున్న మానవుల వలే గంభీరాకృతిని పుణికిపుచ్చుకున్న శిలాపర్వతాలతో అక్కడి వాతావరణం ఆహ్లాదకరమైన భావనతో మనసులను రంజింప చేస్తున్నది. దీనికి తోడు ఆకాశాన్ని తాకుతున్నట్లుగా కనిపించే మహావృక్షాలు, విరుల గుభాళింపులు, అందమైన సరస్సులు, చల్లదనాన్ని పంచే శీతల పవనాలు సందర్శకులను అక్కడినుంచి కదలనివ్వవు.

వెబ్దునియా పై చదవండి