అణు యుద్ధనౌకలను భారత్ నిర్మించగలదు

అణు ఇంధనం ఆధారంగా నడిచే యుద్ధనౌకలను, విమానవాహక నౌకలను భారత్ నిర్మించగలదని జాతీయ అణు శక్తి సంఘం ఛైర్మన్ అనిల్ కకోడ్కర్ తెలిపారు. భారత్‌కు ఈ సామర్థ్యం ఉందని ఆయన చెప్పారు. భారత్ ఇటీవల పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో అణు ఇంధన ఆధారిత జలాంతర్గామిని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.

అణు జలాంతర్గామిని తయారు చేసిన భారతీయులు ఇప్పుడు అణు విమానవాహక నౌకలు, యుద్ద నౌకలు నిర్మించే సాంకేతిక నైపుణ్యం, సామర్థ్యం కూడా కలిగివున్నారని కకోడ్కర్ వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అణు ఇంధన ఆధారిత యుద్ధ నౌకల నిర్మాణానికి అవసరమైన సాంకేతిక నైపుణ్యం, సామర్థ్యం మనకుందని ఆయన ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పేర్కొన్నారు.

ప్రభుత్వం ఇటువంటి నౌకల నిర్మాణం చేపట్టాలని కోరితే, శాస్త్రవేత్తలు వాటి తయారీని కూడా చేపడతారని కకోడ్కర్ తెలిపారు. గత నెలలో అణు జలాంతర్గామిని ఆవిష్కరిస్తున్న సందర్భంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ.. ఇటువంటి జలాంతర్గాముల తయారీని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి