కర్ణాటకలో భాజపా మహిళా మంత్రి శోభా రాజీనామా!

సోమవారం, 9 నవంబరు 2009 (17:15 IST)
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్పకు అత్యంత నమ్మకస్తులైన మంత్రులుగా వారిలో మహిళా మంత్రి శోభా కరందలజే ఒకరు. ఈమె సోమవారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి యడ్యూరప్పకు అందజేశారు. ఇదే కోవలో మరో ఇద్దరు ముగ్గురు ఉన్నట్టు సమాచారం.

కర్ణాటక రాజకీయ సంక్షోభం పరిష్కరించే దిశగా కేంద్ర నాయకత్వం సమక్షంలో ముఖ్యమంత్రికి, అసమ్మతి నేత గాలి జనార్ధన్ రెడ్డికి మధ్య కుదిరిన ఒప్పందం మేరకు నలుగురు మంత్రులను బీఎస్ తొలగించాల్సి వుంది. వారిలో ఒకరైన శోభా తన కేబినెట్ పదవికి రాజీనామా చేశారు. కర్ణాటక మంత్రివర్యుల్లో ఉన్న ఏకైక మహిళా మంత్రి ఈమె కావడం గమనార్హం.

సంక్షోభం పూర్తి కాకముందే ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ వీపీ.బాలిగర్‌పై వేటు వేసిన విషయం తెల్సిందే. అయితే, సంక్షోభం ముగిసిన తర్వాత ఆదివారం రాత్రి బెంగుళూరుకు చేరుకున్న యడ్యూరప్ప మాత్రం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రుల తొలగింపునకు సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని స్పష్టం చేసిన 24 గంటలు పూర్తి కాకముందే మంత్రి శోభా రాజీనామా చేయడం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి