తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం : చిదంబరం

సోమవారం, 5 ఆగస్టు 2013 (16:42 IST)
File
FILE
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం తెలిపారు. ఈ క్రమంలో కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు ముందు అనేక అంశాలు పరిష్కరించాల్సి ఉందని, వాటన్నింటినీ ప్రభుత్వం పరిశీలిస్తోందని ఆయన సోమవారం రాజ్యసభలో ఒక ప్రకటన చేశారు. దీనిపై కేంద్ర హోం శాఖ సమగ్ర విధానపత్రాన్ని కేబినెట్ ముందుకు తీసుకొస్తుందని సభకు తెలిపారు.

దీనికి సంబంధించి ఓ నోట్‌ను సిద్ధం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు రాజ్యాంగంలో కొన్ని విధివిధానాలు ఉన్నాయని చిదంబరం గుర్తు చేశారు. ఈ విధాన పత్రంలో విద్యుత్, నదీ జలాలు, పంపిణీ, ప్రజల భద్రతా అంశాలు, ప్రాథమిక హక్కుల రక్షణ, ఇతర అంశాలు కూడా ఉంటాయని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లును కేబినెట్ ఆమోదించాక మంత్రివర్గ ఉపసంఘం ఏర్పడుతుందని, ఆ సంఘం ముందు అందరూ తమ వాదనలు వినిపించవచ్చని వివరించారు. తగిన సమయంలో ఈ నోట్‌పై కేంద్ర ప్రభుత్వం ఉభయ సభల్లో చర్చకు అవకాశం ఇస్తుందని మంత్రి చిదంబరం తెలిపారు.

వెబ్దునియా పై చదవండి