నరేంద్ర మోడీని కలిసిన లంక మంత్రి

శ్రీలంక పర్యాటక శాఖామంత్రి మిలిండా మొరగోడా గురువారం గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వీరిద్దరు ఇరు ప్రాంతాల ద్వైపాక్షిక సంబంధాలు, సంస్కృతి, ఆర్థిక, పర్యాటక రంగాల గురించి చర్చించారు. ఇటీవలి కాలంలో శ్రీలంక మంత్రివర్గానికి చెందిన సీనియర్ మంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రితో భేటీ కావడం ఇదే తొలిసారి.

అంతేకాకుండా భవిష్యత్‌లో కూడా ఇరు ప్రాంతాల ప్రతినిధుల చర్చలు కొనసాగించేందుకు వారిద్దరు సమ్మతించారు. ఇదిలావుండగా సౌరాష్ట్రలోని ప్రఖ్యాత సోమనాథ్‌ ఆలయంలో శ్రీలంక మంత్రి మొరగోడా ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు.

ఈ సందర్భంగా మొరగోడా మాట్లాడుతూ.. తమ దేశం పర్యాటక రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. తమ దేశానికి వచ్చే పర్యాటకుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్టు ఆయన వెల్లడించారు. అలాగే ప్రత్యేక ప్యాకేజీలతో పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటున్నట్టు ఆయన వివరించారు.

వెబ్దునియా పై చదవండి