నరేంద్ర మోడీ ప్రధాని అవుతాడేమోనన్న భయంలో అమెరికా!

మంగళవారం, 8 ఏప్రియల్ 2014 (11:34 IST)
File
FILE
భారతదేశ తదుపరి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అవుతాడేమోనన్న భయంలో అగ్రరాజ్యం అమెరికా ఉందని శివసేన అభిప్రాయపడింది. ఈ మేరకు ఆ పార్టీ పత్రిక సామ్నాలో ఒక కథనాన్ని ప్రచురించింది. పిల్లిలా ఉన్న భారత్ పులిలా మారుతుందేమోనని అగ్రరాజ్యం భయపడుతోందని పేర్కొంది. మోడీ భారత ప్రధాని అయితే తమ ఆధిపత్యానికి తెరపడుతుందనే ఆందోళనలో అమెరికా ఉందని తెలిపింది.

అందుకే... మోడీ ప్రధాని అయితే భారత్‌లోని ముస్లింలు అణచివేతకు గురవుతారని ఇటీవల కాలంలో అమెరికా అభిప్రాయపడిందని ఆరోపించింది. భారతదేశ ఎన్నికలు, రాజకీయాలలో తలదూర్చడానికి అమెరికాకు హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించింది.

ఇరాక్, ఆఫ్ఘనిస్థాన్‌లలోని ముస్లింలను అమెరికా ఊచకోత కోసిందని... దీనిపై మాత్రం ఆ దేశానికి ఏ మాత్రం బాధ ఉండదని విమర్శించింది. 9/11 దాడుల తర్వాత అమెరికాలోని ముస్లింలపై ఆ దేశంలోని వివిధ ఇంటలిజెన్స్ విభాగాలు నిఘా ఉంచాయని... దీంతో అక్కడి ముస్లింలు నరకయాతనకు అనుభవిస్తున్నారని ఆరోపించింది.

మన దేశానికి చెందిన ముస్లిం సెలబ్రిటీలైన షారుక్ లాంటి వారిని కూడా అమెరికా విమానాశ్రయాల్లో గంటల తరబడి వేచియుండేలా చేశారని మండిపడింది. భారత్‌లోని ముస్లింలను ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసని... అంతర్జాతీయ పోలీసు పాత్ర పోషిస్తున్న అమెరికాతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదని సూచించింది.

వెబ్దునియా పై చదవండి