ప్రధాని వెంటనే రాజీనామా చేయాలి: సుష్మ స్వరాజ్ డిమాండ్

గురువారం, 8 డిశెంబరు 2011 (15:30 IST)
విపరీతంగా పెరిగిపోతున్న నిత్యావసర ధరలను నియంత్రించలేని ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తన పదవికి రాజీనామా చేయాలని ప్రధాన ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ గురువారం లోక్‌సభలో డిమాండ్ చేశారు. నిత్యావసర ధరలను కట్టడిలో యూపీఏ ప్రభుత్వం విఫలమైందని, ఇందుకు బాధ్యత వహిస్తూ ప్రధాన మంత్రి పదవి నుంచి మన్మోహన్ సింగ్ తప్పుకోవాలన్నారు.

ధరల పెరుగులదలపై లోక్‌సభలో చర్చ సాగింది. ధరల పెరుగుదలపై విపక్షాలు లోక్‌సభలో మండిపడ్డాయి. ఈ సందర్భంగా సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ.. కేంద్రం సగటు మనిషిని విస్మరిస్తోందని దుయ్యబట్టారు. ధరలను తగ్గించకుండా కేంద్రం సాకులు చెబుతోందని ధ్వజమెత్తారు.

ధరల నియంత్రణకు లోక్‌సభలో రెండుసార్లు తీర్మానం చేసినా ఫలితం శూన్యమని సుష్మా వ్యాఖ్యానించారు. అయితే సుష్మా వ్యాఖ్యలను కేంద్ర విత్తమంత్రి ఖండించారు. ధరల నియంత్రణకు కేంద్రం తగిన చర్యలు తీసుకుంటుందని, ఈ క్రమంలో ఆహార ద్రవ్యోల్బణం రెండంకెల నుంచి 6.6 శాతానికి తగ్గిందని ప్రణబ్ వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి