మన్మోహన్ కేబినెట్‌లో 9 మంది మహిళలు

గురువారం, 28 మే 2009 (11:41 IST)
కేంద్రంలో వరుసగా రెండోసారి కొలువుదీరిన ప్రధాని మన్మోహన్ సింగ్.. తన కేబినెట్‌లో తొమ్మిది మంది మహిళలకు స్థానం దక్కింది. వీరిలో ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కాగా, ఒకరు మిత్రపక్షమైన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, మరొకరు నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీకి చెందిన అగతా సంగ్మాలు ఉన్నారు.

ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం వరుసగా విజయం సాధించిన విషయం తెల్సిందే. దీంతో ఈనెల 22వ తేదీన ప్రధానిగా మన్మోహన్ సింగ్ రెండో సారి ప్రమాణ స్వీకారం చేశారు.

మన్మోహన్ సింగ్‌తో పాటు ప్రమాణం చేసిన రోజున కేబినెట్ మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో మమతా బెనర్జీ, అంబికాసోనీ, మీరా కూమార్‌లు ఉన్నారు. తాజాగా, విస్తరించిన మంత్రివర్గంలో మరో ఆరుగురికి చోటు కల్పించారు.

వీరిలో కృష్ణాతీర్థ (ఢిల్లీ), ప్రణీత్ కౌర్ (పాటియాలా-పంజాబ్), అగతా సంగ్మా (తురా, మేఘాలయా) లు ఉన్నారు. వీరు తొలిసారి మంత్రులుగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. వీరితో పాటు పనబాక లక్ష్మీ (బాపట్ల), పురంధేశ్వరి (విశాఖపట్నం)లు ఉన్నారు.

కాగా, గత ప్రభుత్వంలో పది మంది మహిళలు మంత్రులుగా ఉన్నారు. మీరా కుమార్ (సామాజిక న్యాయం, సాధికారత), అంబికా సోనీ (సాంస్కృతిక, పర్యాటక శాఖామంత్రి), రేణుకా చౌదరి (మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధి)లు ఉన్నారు.

వీరితో పాటు పనబాక లక్ష్మీ (వైద్య ఆరోగ్యం), కాంతీ సింగ్ (కల్చరల్ అండ్ టూరిజమ్), రాధికా సెల్వి (హోం అఫైర్స్), సూర్యకాంత పాటిల్ (గ్రామీణ అభివృద్ధి, పార్లమెంటరీ అఫైర్స్), సుబ్బులక్ష్మీ జగదీశన్ (సోషల్ జస్టీస్), పురంధేశ్వరి (మానవవనరులు)లు మంత్రులుగా పని చేశారు.

వెబ్దునియా పై చదవండి