బాలాజీ టెంపుల్ సమీపంలో ప్రమాదం... 11 మంది మృత్యువాత

మంగళవారం, 31 ఆగస్టు 2021 (12:56 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని నగౌర్‌ జిల్లాలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బికనీర్‌-జోధ్‌పూర్‌ రహదారిలోని శ్రీ బాలాజీ టెంపుల్‌ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఏకంగా 11 మంది మృత్యువాతపడ్డారు. ఎదురెదురుగా వచ్చిన ఓ కారు‌, టక్కు పరస్పరం ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 
 
గాయపడిన వారిని బికనీర్‌లోని ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాధితులంగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. రాజస్థాన్‌లోని రామ్‌దేవరా కర్నీ మాత దేవాలయాలను దర్శించుకొని తిరిగి ఇంటికి బయల్దేరిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
 
మరోవైపు, ఈ రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీతో పాటు మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌లు తీవర తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్‌లో స్పందించారు. ఈ ఘటన జరగడం బాధాకరమని పేర్కొన్నారు. 
 
ఈ క్రమంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షలు, గాయపడిన వారికి 50 వేల చొప్పున పీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి ఎక్స్‌గ్రేషియా అందించనున్నట్లు ప్రధాని మోడీ వెల్లడించారు. అలాగే, ఎంపీ సర్కారు కూడా మరణించిన 11 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా సహాయాన్ని ప్రకటించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు